రూ.123 ఇవ్వాల్సిన చోట.. రూ.3.62 లక్షల కోట్లు! | South Korean Crypto Exchange Gives Rs 3.62 Lakh Crore In Bitcoin Error | Sakshi
Sakshi News home page

రూ.123 ఇవ్వాల్సిన చోట.. రూ.3.62 లక్షల కోట్లు!

Feb 9 2026 2:40 PM | Updated on Feb 9 2026 4:32 PM

South Korean Crypto Exchange Gives Rs 3.62 Lakh Crore In Bitcoin Error

దక్షిణ కొరియాలోని ప్రముఖ క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్ బిథంబ్ (Bithumb)లో ఒక టెక్నికల్ ఎర్రర్ వచ్చింది. దీంతో లక్షల కోట్ల బదిలీ జరిగింది. వినియోగదారులకు చిన్న మొత్తంలో ప్రోత్సాహక బహుమతులు ఇవ్వాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ సంఘటన జరిగింది.

సాధారణంగా విజేతలకు సుమారు 2,000 కొరియన్ వోన్‌లు (భారత కరెన్సీలో దాదాపు రూ.123) మాత్రమే ఇవ్వాల్సి ఉండగా.. సిస్టమ్‌లో జరిగిన పొరపాటు వల్ల ప్రతి విజేత ఖాతాకు 2,000 బిట్‌కాయిన్లు జమయ్యాయి. మొత్తం 695 ఖాతాలకు ఇలా బిట్‌కాయిన్లు పంపించడంతో, సుమారు 6,20,000 బిట్‌కాయిన్లు అనుకోకుండా బదిలీ అయ్యాయి. నేటి మార్కెట్ విలువ ప్రకారం.. వీటి విలువ సుమారు రూ.3.62 లక్షల కోట్లు (దాదాపు 40 బిలియన్ డాలర్లు).

పొరపాటు జరిగిందనే విషయం తెలుసుకున్న వెంటనే.. సంస్థ నిమిషాల వ్యవధిలోనే సంబంధిత ఖాతాల్లో ట్రేడింగ్ & విత్‌డ్రాయల్స్‌ను నిలిపివేసింది. అనుకోకుండా పంపిన బిట్‌కాయిన్లను తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియను ప్రారంభించింది. మొత్తానికి 99.7 శాతం బిట్‌కాయిన్లను తిరిగి రాబట్టగలిగింది.

ఈ ఘటనపై స్పందించిన బిథంబ్.. వినియోగదారులకు క్షమాపణలు చెప్పింది. ఇది హ్యాకింగ్ లేదా భద్రతా లోపం వల్ల జరిగిన తప్పిదం కాదని, కేవలం బహుమతుల పంపిణీ ప్రక్రియలో జరిగిన సాంకేతిక పొరపాటు మాత్రమేనని స్పష్టం చేసింది. అంతే కాకుండా సంస్థకు సంబంధించిన భద్రతా వ్యవస్థలు బాగానే ఉన్నాయని, వినియోగదారుల ఆస్తులకు ఎలాంటి ప్రమాదం లేదని కూడా వెల్లడించింది.

ఇదీ చదవండి: 2026లో బంగారం, వెండి భవిష్యత్తు ఇదే!: బాబా వంగా

బిథంబ్ ప్లాట్‌ఫారమ్‌లో జరిగిన ఈ తప్పిదం.. బిట్‌కాయిన్ ధరపై తీవ్రమైన ప్రభావం చూపించింది. దీంతో బిట్‌కాయిన్ విలువ 17 శాతం తగ్గింది. ఈ ఘటనపై దక్షిణ కొరియా బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ అయిన ఫైనాన్షియల్ సూపర్వైజరీ సర్వీస్ (FSS) ఒక సమావేశం నిర్వహించి విచారణ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయంలో బిథంబ్ సంస్థ పూర్తిగా సహకరిస్తామని వెల్లడించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement