బంగారం ధరలు ఇటీవల స్వల్పంగా తగ్గినప్పటికీ సార్వభౌమ పసిడి బాండ్లలో (సావరీన్ గోల్డ్ బాండ్స్-ఎస్జీబీ) పెట్టుబడి పెట్టిన వారికి గత ఏడాదితో పోలిస్తే ఇప్పటికీ 34-44 శాతం వరకు లబ్ధి చేకూరుతోంది. కొత్తగా ఎస్జీబీల జారీని ప్రభుత్వం నిలిపివేసినప్పటికీ 2032 ఫిబ్రవరి వరకు గడువు తీరే దాదాపు 45 బాండ్లు ప్రస్తుతం స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్లాట్ఫామ్ల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇవి వార్షికంగా 2.50 శాతం వడ్డీని అందిస్తూనే గడువు ముగిసే సమయానికి నాటి పసిడి మార్కెట్ ధర ఆధారంగా మెచ్యూరిటీ సొమ్మును చెల్లిస్తాయి.
900 శాతానికి పైగా పెరుగుదల
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఫిబ్రవరి 2024లో చివరిసారిగా ఎస్జీబీని జారీ చేసింది. 2015 చివరిలో ఈ పథకం ప్రారంభమైనప్పుడు 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.25,000 ఉండగా ప్రస్తుతం అది దాదాపు రూ.1.29 లక్షలకు చేరింది. ఫలితంగా, ప్రభుత్వంపై ఎస్జీబీల బాధ్యత సుమారు రూ.1.12 లక్షల కోట్ల- రూ.1.20 లక్షల కోట్లకు (సుమారు 130 టన్నుల బంగారం) పెరిగింది. ఇది 2015తో పోలిస్తే 900 శాతానికి పైగా పెరుగుదల.
ఈ క్రమంలోనే ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి కేంద్ర బడ్జెట్ 2026లో కీలక పన్ను సవరణ చేసింది. ఇకపై ఆర్బీఐ ద్వారా ప్రాథమికంగా బాండ్లు కొనుగోలు చేసి ఎనిమిదేళ్ల గడువు వరకు ఉంచుకునే వారికి మాత్రమే మూలధన లాభాల పన్ను మినహాయింపు లభిస్తుంది. సెకండరీ మార్కెట్ (NSE/BSE)లో ఇతరుల నుంచి ఎస్జీబీలు కొనుగోలు చేసేవారికి ఈ పన్ను మినహాయింపు వర్తించదని నిపుణులు చెబుతున్నారు. బాండ్ల పన్ను విధానంలో వచ్చిన మార్పుల నేపథ్యంలో కొత్తగా పసిడిలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి గోల్డ్ ఈటీఎఫ్లు మెరుగైన ప్రత్యామ్నాయమని సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: కోకా-కోలా ‘ఫెయిర్లైఫ్’పై సైబర్ దాడి


