-
గోల్డ్ కంటే గోల్డ్ బాండ్లు బెటరా? చివరి తేది.. దరఖాస్తు విధానం..
బంగారం కొనాలని అనుకుంటున్నారా? ఫిజికల్ గోల్డ్తో పాటు అంతే విలువ గల సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ)లను కొనుగోలు చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఎస్జీబీ గోల్డ్ కోసం ఈ నెల 12 నుంచి 16 వరకు దరఖాస్తు చేసుకునేందుకు భారతీయ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అవకాశం కల్పించింది. భౌతిక బంగారంతో పోలిస్తే సావరిన్ గోల్డ్ బాండ్స్ కొనుగోలులో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. బంగారం కొనుగోలులో సాధారణంగా వర్తించే మేకింగ్, జీఎస్టీ వంటి అదనపు ఛార్జీలు గోల్డ్బాండ్ల విషయంలో ఉండవన్నది గమనించాలి. చోరీ భయం అసలే ఉండదు. కాబట్టి బంగారంలో పెట్టుబడి పెట్టేవారు గోల్డ్ బాండ్లను పరిశీలించొచ్చు. 20 కిలోల వరకూ కొనుగోలు గోల్డ్ సావరిన్ బాండ్లు కొనుగోలు చేసేవారు ఒక గ్రామ్ – ఒక యూనిట్ కింద కొనుగోలు చేయాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు అత్యధికంగా నాలుగు కిలోలు, ట్రస్టులు 20 కిలోల వరకూ కొనుగోలు చేయొచ్చు. ఈ బాండ్ గడువు ఎనిమిదేళ్లు ఉంటుంది. ఐదేళ్ల తర్వాత అవసరమనుకుంటే బాండ్ల కొనుగోలుదారులు తప్పుకోవచ్చు. ఫిజికల్ గోల్డ్ కొనుగోలుకు అమలులో ఉన్న ‘కేవైసీ’ నిబంధనలే బాండ్ల కొనుగోలుకు కూడా వర్తిస్తాయి. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2023-24 సిరీస్ 4 భారత ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్పై నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం.. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2023-24 సిరీస్ 4 ఫిబ్రవరి 12 నుంచి 16 వరకు కొనసాగనుంది. ఈ బాండ్స్ కోసం ధరఖాస్తు చేసుకున్న వారికి భారతీయ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బాండ్లు జారీ చేస్తుంది. ఆర్బీఐ ఇష్యూ చేసిన ధర యూనిట్కు రూ.6,213గా ఉంది. ఎక్కడ కొనుగోలు చేయాలంటే.. కమర్షియల్ బ్యాంకుల్లో ఈ సావరిన్ బాండ్లను కొనుగోలు చేయొచ్చు. వీటితో పాటు స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్హెచ్సీఐఎల్), క్లియర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీసీఐఎల్), పోస్టాఫీసులు, గుర్తింపు పొందిన స్టాక్ ఎక్ఛేంజ్ సంస్థలు అంటే నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బాంబే స్టాక్ ఎక్ఛేంజ్లలో కొనుగోలు చేయొచ్చు. ఆన్లైన్లో కొనుగోలు విధానం.. నెట్బ్యాంకింగ్కు లాగిన్ అవ్వాలి. మెనూలో ఈ-సర్వీసెస్/ ఇన్వెస్ట్మెంట్ అనే సెక్షన్లో ‘సావరిన్ గోల్డ్ బాండ్’ ఆప్షన్ క్లిక్చేయాలి. షరతులు, నియమాలు చదివి ప్రొసీడ్పై నొక్కాలి. సావరిన్ గోల్డ్ బాండ్కు అవరమైన వివరాలు అందులో నమోదు చేసి డిపాజటరీ పార్టిసిపేట్ (ఎన్ఎస్డీఎల్ లేదా సీడీఎస్ఎల్)ను ఎంచుకోవాలి. అనంతరం రిజిస్ట్రేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి. రిజిస్ట్రేషన్ తర్వాత పర్చేజ్ ఆప్షన్ వస్తుంది. ఇదీ చదవండి: ‘అవసరమైతే ఉద్యోగం మానేస్తాం.. కానీ..’ ఉద్యోగుల సంచలన నిర్ణయం మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న యూనిట్లు, నామినీ వివరాలు ఎంటర్ చేయాలి. తర్వాత మీ మొబైల్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయడంతో ప్రక్రియ ముగుస్తుంది. -
కొత్త గోల్డ్ బాండ్ స్కీమ్.. ఆన్లైన్లో కొనుగోలు చేస్తే డిస్కౌంట్
న్యూఢిల్లీ: సావరిన్ గోల్డ్ బాండ్ కొత్త ఇష్యూ ఈ నెల 11న (సోమవారం) ప్రారంభం కానుంది. 15వ తేదీ వరకూ అందుబాటులో ఉండే ఈ స్కీమ్ ఇష్యూ ధర గ్రాముకు రూ.5,923. ఆన్లైన్లో కొనుగోలు చేస్తే, రూ.50 డిస్కౌంట్ లభిస్తుంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఇది రెండవ విడత బాండ్ల జారీ. జూన్ 19న వెలువడిన మొదటి విడత బాండ్ జారీలో ధర గ్రాముకు రూ.5,926. గోల్డ్ బాండ్లు– షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నిర్దిష్ట పోస్టాఫీసులు, డీ–మ్యాట్ అకౌంట్తో గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్చేంజీల ద్వారా కొనుగోలు చేయవచ్చు. భౌతిక బంగారాన్ని కొనుగోలు చేయడానికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం తరపున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా సావరిన్ గోల్డ్ బాండ్లు జారీ చేస్తారు. 2015 నవంబర్లో ప్రవేశపెట్టిన సావరిన్ గోల్డ్ బాండ్లు.. భౌతిక బంగారం డిమాండ్ను తగ్గించడం, బంగారం కొనుగోళ్ల నుంచి దేశీయ పొదుపులో కొంత భాగాన్ని ఆర్థిక పొదుపులకు మళ్లించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. పెట్టుబడిదారులు ఇష్యూ ధరను నగదు రూపంలో చెల్లించాలి. మెచ్యూరిటీపై బాండ్లను నగదు రూపంలో రీడీమ్ చేసుకోవచ్చు. -
నేటి నుండి పసిడి బాండ్ల విక్రయం
న్యూఢిల్లీ: తదుపరి విడత సావరీన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ) విక్రయం సోమవారం ప్రారంభమై అయిదు రోజుల పాటు కొనసాగనుంది. ఇష్యూ ధరను గ్రాము బంగారానికి రూ. 5,091గా నిర్ణయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గోల్డ్ బాండ్ల విక్రయం చేపట్టడం ఇదే తొలిసారి. ఆన్లైన్ మాధ్యమం ద్వారా దరఖాస్తు చేసుకుని, డిజిటల్ విధానంలో చెల్లిస్తే గ్రాముకు రూ. 50 చొప్పున డిస్కౌంటు లభిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం 2015 నవంబర్లో ప్రారంభమైనప్పట్నుంచీ ఈ స్కీము ద్వారా ప్రభుత్వం రూ. 38,693 కోట్లు (సుమారు 90 టన్నుల బంగారం విలువ) సమీకరించింది. కోవిడ్ వ్యాప్తి సమయంలో (2020–21, 2021–22) ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం వైపు ఎక్కువగా మొగ్గు చూపారు. ఏకంగా రూ. 29,040 కోట్ల మేర బాండ్లను కొనుగోలు చేశారు. ఈ స్కీము ద్వారా ఇప్పటిదాకా ప్రభుత్వం సమీకరించిన నిధుల్లో ఇది దాదాపు 75 శాతానికి సమానం కావడం గమనార్హం. -
ప్రభుత్వ గోల్డ్ బాండ్.. ఆర్బీఐ పోర్టల్లో.. పూర్తి వివరాలు
ముంబై: సావరిన్ గోల్డ్ బాండ్ ఇకపై ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ పోర్టల్లోనూ లభ్యం కానుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎనిమిదవ సిరీస్ ఈ నెల మూడవ తేదీతో (శుక్రవారం) ముగియనున్న సంగతి తెలిసిందే. 29వ తేదీన ఈ సిరీస్ ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రభుత్వ గోల్డ్ బాండ్స్ నిర్దిష్ట బ్యాంకులు, పోస్టాఫీసులు, ఎన్ఎస్ఈ, బీఎస్ఈ, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొనుగోలు చేసే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత నెల్లో ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్ను ప్రారంభించారు. వ్యక్తులు నేరుగా ట్రెజరీ బిల్లులు, డేటెడ్ సెక్యూరిటీలు, సావరిన్ గోల్డ్ బాండ్లు (ఎస్జీబీ) స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ (ఎస్డీఎల్) ప్రైమరీ, సెకండరీ మార్కెట్ నుండి నేరుగా కొనుగోలు చేసే సౌలభ్యతను ఈ స్కీమ్ కల్పిస్తోంది. https://rbiretaildirect.org.in లో ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ పోర్టల్ ఇందుకు వేదికగా ఉంది. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లకు అనుసంధానం ఈ స్కీమ్ కింద రిటైల్ ఇన్వెస్టర్లు (వ్యక్తిగతంగా) ఆన్లైన్ రిటైల్ డైరెక్ట్ గిల్ట్ అకౌంట్ (ఆర్డీజీ అకౌంట్)ను ప్రారంభించవచ్చు. ఈ అకౌంట్లను ప్రత్యక్షంగా తమ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లకు అనుసంధానించవచ్చు. స్క్రీన్ ఆధారిత ఎన్డీఎస్–వోఎం ద్వారా సెకండరీ మార్కెట్ ఆపరేషన్స్, ప్రభుత్వ సెక్యూరిటీల జారీ వంటి కార్యకలాపాల్లో పాల్గొనేందుకు వ్యక్తిగత ఆర్డీజీ అకౌంట్లను వినియోగించుకోవచ్చు. ఎన్డీఎస్–వోఎం అనేది ప్రభుత్వ సెక్యూరిటీలకు సంబంధించి సెకండరీ మార్కెట్ ట్రేడింగ్ కోసం ఉద్దేశించిన ఒక స్క్రీన్ ఆధారిత ఎలక్ట్రానిక్ వ్యవస్థ. ఆర్బీఐ నియంత్రణలో ఇది పనిచేస్తుంది. ఇప్పటి వరకూ ఇది బ్యాంకులు, ప్రైమరీ డీలర్లు, బీమా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్కు మాత్రమే అందుబాటులో ఉంది. సెక్యూరిటీల కొనుగోళ్లకు సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ (ఏకీకృత చెల్లింపుల విధానం) తదితర మార్గాల్లో సులభతరంగా చెల్లింపులు చేయవచ్చు. ఇతరత్రా ఏవైనా సహాయం కావాలంటే పోర్టల్లో అన్ని వివరాలు ఉంటాయి. టోల్ ఫ్రీ టెలిఫోన్ నంబరు 1800–267–7955 (ఉదయం 10 గం. నుంచి సాయంత్రం 7 గం. దాకా), ఈమెయిల్ కూడా అందుబాటులో ఉంటాయి. ఈ స్కీము కింద అందించే సదుపాయాలకు ఎటువంటి చార్జీలు ఉండవని ఆర్బీఐ తెలిపింది. దేశీయంగా సేవింగ్స్ ఖాతా, పాన్, కేవైసీ కోసం అధికారికంగా చెల్లుబాటయ్యే పత్రం, ఈమెయిల్ ఐడీ, రిజిస్టర్ మొబైల్ నంబరుతో రిటైల్ ఇన్వెస్టర్లు నమోదు చేయించుకోవచ్చు. కొనుగోలు చేసిన సెక్యూరిటీలు.. సెటిల్మెంట్ రోజున ఆర్డీజీ ఖాతాలోకి జమవుతాయి. -
పెరిగిన బంగారం ధరలు.. లాభపడదామా..?
బంగారం ధరలు గడిచిన ఏడాది కాలంలో 40 శాతానికి పైగా ర్యాలీ చేశాయి. ఇన్వెస్టర్ల పోర్ట్ఫోలియోలో బంగారానికి తప్పకుండా చోటు ఇవ్వాలన్నది నిపుణుల సూచన. ఆ దిశగా బంగారంలో పెట్టుబడులు పెడితే మంచిదే. కానీ, ప్రత్యేక అవసరాల కోసం, స్వల్ప కాల అవసరాల కోసం బంగారంలో ఇన్వెస్ట్ చేసే వారూ ఉన్నారు. ప్రస్తుత విపత్తు సమయంలో ప్రతికూలతలను గట్టెక్కేందుకు... సార్వభౌమ బంగారం బాండ్లలో (గోల్డ్ బాండ్స్/ఎస్జీబీ) పెట్టుబడులను తీసేసుకోవాలని అనుకునే వారు లేకపోలేదు. బంగారం ఈటీఎఫ్ల్లో ఇన్వెస్ట్ చేసిన వారు వాటిని విక్రయించుకోవడం ఎంతో సులభం. కానీ, భారత ప్రభుత్వం జారీ చేసే సౌర్వభౌమ బంగారం బాండ్లలో ఇన్వెస్ట్ చేసిన వారికి మాత్రం ఆప్షన్లు పరిమితం. ∙ ఈ ఏడాది ఇప్పటి వరకు చూస్తే నిఫ్టీ ప్రధాన సూచీ 21 శాతం మేర నష్టపోతే, ఇదే సమయంలో బంగారం ధరలు 17 శాతం మేర ప్రియంగా మారాయి. దీంతో గోల్డ్ ఈటీఎఫ్లు, ఈ బంగారం, బంగారంలో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్, ఎస్జీబీలో పెట్టుబడులపై లాభాల వర్షం కురిసింది. ముఖ్యంగా ఎస్జీబీల్లో గడిచిన ఐదేళ్ల కాలంలో ఇన్వెస్ట్ చేసిన వారి పంట పండింది. భౌతిక బంగారంలో పెట్టుబడులను నిరుత్సాహపరచడం, బంగారంలో పెట్టుబడులకు డిజిటల్ దిశగా మళ్లించడమే ఎస్జీబీని తీసుకురావడంలోని ఉద్దేశ్యం. ఈ ప్రయోజనం కొంత వరకు నెరవేరిందనే చెప్పుకోవాలి. భాతిక బంగారంతో పోలిస్తే ఎస్జీబీలో పెట్టుబడులపై వార్షికంగా 2.50% వడ్డీ లభిస్తుంది. అదే సమయంలో బంగారం ధరలు పెరిగితే రెండు విధాలుగా ప్రయోజనం కలుగుతుంది. ఎస్జీబీ మొదటి ఇష్యూ 2015 నవంబర్లో సిరీస్–1 పేరుతో వచ్చింది. అప్పటి నుంచి చూస్తే బంగారం ధరల్లో ర్యాలీ కారణంగా పెట్టుబడి 84 శాతం వృద్ధి చెందింది. అదే విధంగా 2019–20 ఆర్థిక సంవత్సరం జూన్ మాసంలో ఎస్జీబీ ఇష్యూలో ఇన్వెస్ట్మెంట్పైనా రాబడి 48 శాతంగా ఉంది. విక్రయించడానికి సరైన సమయమేనా..? చరిత్రను పరిశీలిస్తే.. ప్రతీ మార్కెట్ సైకిల్ (వివిధ సందర్భాలు)లోనూ బంగారం ర్యాలీ చేసినట్టు ఆధారాల్లేవు. బంగారానికి సురక్షిత పెట్టుబడి సాధనమనే ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకే ఆర్థిక సంక్షోభాలు, స్టాక్ మార్కెట్ల పతనాల్లో బంగారంలో ఇన్వెస్ట్ చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు పోటీపడతారు. ఫలితంగా ఆయా సందర్భాల్లో బంగారం ధరల్లో ర్యాలీ నడుస్తుంటుంది. 2019 మధ్య భాగం నుంచి బంగారంలో ర్యాలీ రావడానికి తోడ్పడిన పరిణామం.. అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధమనే చెప్పుకోవాలి. దాంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. ఆ తర్వాత కరోనా వైరస్ ప్రపంచ దేశాలపై పంజా విసరడం, ఆర్థిక వ్యవస్థలు సంక్షోభాల్లోకి జారిపోవడం చూస్తూనే ఉన్నాం. ప్రపంచదేశాలు, కేంద్ర బ్యాంకులు అన్ని చేతులతోనూ నిధులను పంప్ చేసే కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ.. సహజ శక్తి తిరిగి ఆర్థిక వ్యవస్థల్లోకి వచ్చి చేరాలంటే అందుకు కొంత కాలం పడుతుందని.. 2021 వరకు ఒత్తిళ్లు కొనసాగుతాయన్న అంచనాలు నిపుణుల నుంచి వస్తున్నాయి. కనుక బంగారంలో ర్యాలీ మరికొంత కాలం పాటు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇన్వెస్టర్లు పెట్టుబడుల్లో 5–10 శాతాన్ని బంగారానికి కేటాయించుకోవచ్చు. కనుక పెట్టుబడుల కోణంలో ఎస్జీబీల్లో ఇన్వెస్ట్ చేసుకుని ఉంటే వాటిని కొనసాగించుకోవచ్చు. ఒకవేళ ప్రస్తుత లాక్డౌన్ కారణంగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న వారు.. లేదా కొంత మేర పెట్టుబడులను దీర్ఘకాలానికి ఈక్విటీల కోసం కేటాయించుకోవాలనుకుంటే.. ఎస్జీబీల నుంచి కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. సెకండరీ మార్కెట్... సార్వభౌమ బంగారం బాండ్ (ఎస్జీబీ)లో పెట్టుబడులకు 8 ఏళ్ల కాలవ్యవధి. కాకపోతే 5వ ఏట చివరి నుంచి వైదొలిగేందుకు అవకాశం ఉంటుంది. కానీ, ఆ లోపు విక్రయించాలంటే అందుకు సెకండరీ మార్కెట్ ఒక్కటే అవకాశం. 2015 నవంబర్ నుంచి ఇప్పటి వరకు 37 సిరీస్ల ఎస్జీబీ ఇష్యూలు ముగిశాయి. ఇవన్నీ కూడా బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో క్యాష్ విభాగంలో ట్రేడవుతున్నాయి. కాకపోతే సెకండరీ మార్కెట్లో ఎస్జీబీలను విక్రయించాలన్నా లేదా ఇన్వెస్ట్ చేయాలన్నా అందుకు ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలు ఉండడం అవసరం. అదే విధంగా ఎన్ఎస్ఈ, బీఎస్ఈల్లో తగినంత లిక్విడిటీ (ట్రేడింగ్ పరిమాణం) ఉంటేనే వీటిని సరైన ధరలకు విక్రయించుకోవడం వీలవుతుంది. కానీ, చాలా వరకు ఎస్జీబీ ఇష్యూలకు ట్రేడింగ్ వ్యాల్యూమ్ చాలా తక్కువగా ఉంటోంది. ఎన్ఎస్ఈలో గడిచిన ఏడాది కాలంలో సగటు రోజువారీ ట్రేడింగ్ విలువ రూ.1.2 కోట్లుగానే ఉండడం గమనార్హం. కొన్నింటిలో మాత్రం ఈ ఇబ్బం ది లేదు. మొత్తం 37 సిరీస్లలో 12 సిరీస్ల్లో.. గడిచిన 3 నెలల్లో చూస్తే రోజువారీ ట్రేడింగ్ 100 యూనిట్లు, అంతకంటే ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఎస్జీబీఏయూజీ27 (ఎన్ఎస్ఈ కోడ్), ఎస్జీబీఎన్వోబీ24, ఎస్జీబీఏయూజీ24, ఎస్జీబీఎంఏవై25, ఎస్జీబీఎస్ఈపీ24ల్లో రోజువారీ ట్రేడింగ్ వ్యాల్యూమ్ 801–340 యూనిట్ల మధ్య ఉండడాన్ని గమనించాలి. కాకపోతే ప్రతీ రోజూ ఇంతే స్థాయిలో ట్రేడింగ్ పరిమాణం ఉండడం లేదు. ముఖ్యంగా ఎక్కువ మంది బ్రోకర్లు ఎస్బీజీల క్రయ విక్రయాలకు అనుమతించడం లేదు. ఎందుకంటే రెండు డిపాజిటరీల మధ్య (ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్) ఈ బాండ్లకు సంబంధించి సెటిల్మెంట్ అవకాశం లేదు. అయితే, అటువైపు విక్ర యించేవారు, ఇటు కొనుగోలు చేసే వారు ఒకే డిపాజిటరీ పరిధిలో (అయితే ఎన్ఎస్డీఎల్ లేదా సీడీఎస్ఎల్) ఉంటే క్రయ విక్రయాలకు ఇబ్బంది లేదు. అమ్మే వ్యక్తి, కొనుగోలు చేసే వ్యక్తి డీమ్యాట్ ఖాతాలు వేర్వేరు డిపాజిటరీల్లో ఉంటేనే సమస్య. ప్రముఖ బ్రోకింగ్ సంస్థలు... హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్, జెరోదా ఎస్జీబీ యూనిట్ల కొనుగోలు, అమ్మకాలకు అవకాశం కల్పిస్తున్నాయి. ప్రతీ రూ.100 విలువపై 10 పైసల నుంచి 50 పైసల వరకు బ్రోకరేజీ చార్జీలుగా చెల్లించాలి. ఎస్జీబీ అంటే... ఎనిమిదేళ్ల కాల వ్యవధి కలిగిన బంగారం బాండ్. ఇందులో ఒక ఇన్వెస్టర్ ఒక గ్రాము నుంచి 4 కిలోల వరకు కొనచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని, ఆన్లైన్లో చెల్లింపులు చేసిన వారికి రూ.50 డిస్కౌంట్. ఏ ఇష్యూలో అయినా రిటైల్ ఇన్వెస్టర్లు ఆన్లైన్ చెల్లింపులు చేయడం ద్వారా గ్రాముపై రూ.50 డిస్కౌంట్ పొందొచ్చు. గడువు తీరే నాటికి మార్కెట్ రేటు ప్రకారం చెల్లింపులు జరుగుతాయి. అదే విధంగా బాండ్లో పెట్టుబడి విలువపై వార్షికంగా 2.50 శాతం వడ్డీని చెల్లించడం జరుగుతుంది. దీర్ఘకాల లక్ష్యాల కోసం బంగారాన్ని కొద్ది కొద్దిగా సమకూర్చుకోవాలని అనుకునే వారికి, బంగారంలో ఇన్వెస్ట్ చేద్దామనుకునే వారికి అందుబాటులో ఉన్న సాధనాల్లో ఇది మెరుగైనదని నిపుణుల విశ్లేషణ. ఇందులో పెట్టుబడులకు పూర్తి రక్షణ ఉంటుంది. వడ్డీ ఆదాయం లభిస్తుంది. పూర్తి కాలం ఉంచుకుంటే లాభాలపై పైసా పన్ను కట్టక్కర్లేదు. ఇవన్నీ సానుకూలతలు. ఇన్వెస్ట్ చేసిన ధర కంటే బం గారం ధరలు కిందకు పడిపోయి దీర్ఘకాలం పాటు అదే స్థాయిల్లో కొనసాగితే నష్టాలు ఎదుర్కోవాలి. ఆర్బీఐ విండో.. ఎస్జీబీలకు ఐదేళ్లు లాకిన్. ఐదవ ఏట, ఆరవ ఏట, ఏడవ ఏట చివర్లో ఈ బాండ్లలో పెట్టుబడులను వెనక్కి తీసుకోవచ్చు. ఇందుకోసం 30 రోజుల ముందుగా ఆర్బీఐ బైబ్యాక్ విండో ప్రారంభమవుతుంది. పన్ను బాధ్యత ఎస్జీబీల్లో పెట్టుబడులను పూర్తి ఎనిమిదేళ్లు కొనసాగించితే మూలధన లాభాల పన్ను నుంచి మినహాయింపుంటుంది. గడువులోపే సెకండరీ మార్కెట్ లేదా ఆర్బీఐ బైబ్యాక్ విండో ద్వారా విక్రయించినట్టయితే పన్ను చెల్లించాలి. 36 నెలల్లోపు విక్రయించడం వల్ల లాభం సమకూరితే.. ఆ మొత్తాన్ని వ్యక్తిగత వార్షిక ఆదాయంలో చూపించి, నిర్ణీత శ్లా్లబు రేటు ప్రకారం పన్ను చెల్లించాలి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement