Sensex Hits 50,000 First Time, Nifty 14728 All-Time Record - Sakshi
Sakshi News home page

దలాల్ స్ట్రీట్‌లో బైడెన్‌ జోష్‌ : కొత్త చరిత్ర

Published Thu, Jan 21 2021 9:57 AM

 Sensex Hits 50,000 For First Time - Sakshi

సాక్షి,ముంబై : దేశీయ స్టాక్‌ మార్కెట్లు దూకుడుమీద ఉన్నాయి. ఇప్పటికే సరికొత్త శిఖరాలకు చేరిన మార్కెట్‌ గురువారం కూడా అదే ట్రెండ్‌ కొనసాగించింది. ఆరంభంలోనే కీలక సూచీలు రెండూ సరికొత్త గరిష్టాలను నమోదు చేశాయి. తద్వారా సరికొత్త చరిత్ర సృష్టించాయి. ముఖ్యంగా సెన్సెక్స్‌  తొలిసారి 50 వేల  రికార్డు స్థాయిని  అధిగమించగా నిఫ్టీ కూడా 14700 మార్క్‌ను దాటేసి ఆల్‌ టైం రికార్డు స్థాయిని తాకింది.  మెటల్‌ మినహా, దాదాపు అన్ని రంగాల  షేర్లు కొనుగోళ్లతో కళ కళలాడుతున్నాయి.   ప్రస్తుతం 297 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్‌ 50078 వద్ద, నిఫ్టీ 83 పాయింట్ల లాభంతో 14728  వద్ద కొనసాగుతున్నాయి. గత ఏడాది మార్చి నుంచి 10 నెలల్లో రెట్టింపు అయింది. ఈ నేపథ్యంలో దలాల్ స్ట్రీట్ లక్షమార్క్‌కు చేరడానికి మరి ఎంతో కాలం పట్టకపోవచ్చు అని విశ్లేషకులు  భావిస్తున్నారు. 

ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ ఆస్తులను కొనుగోలుకు సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్ 24,713 కోట్ల ఒప్పందాన్ని మార్కెట్ రెగ్యులేటర్ ఆమోదించిన తరువాత రిలయన్స్‌భారీగా లాభపడుతోంది. ఈ దలాల్ స్ట్రీట్‌కు మంచి బలాన్నిచ్చింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్  ప్రమాణ స్వీకారం తరువాత కోవిడ్‌-19 నష్టాలను భర్తీ చేసుకునేందుకు భారీ ఉద్దీపన ప్యాకేజీని పెట్టుబడిదారులుఆ శిస్తున్నారు. దీంతో ఇతర ఆసియామార్కెట్లు కూడా గురువారం కొత్త రికార్డు స్థాయికి చేరుకోవడం విశేషం. లాభాల్లో బజాజ్ ఫైనాన్స్ టాప్‌లో ఉండగా టాటా మోటార్స్, యుపీఎల్, బజాజ్ ఫిన్‌సర్వ్‌, ఇండస్ఇండ్, రిలయన్స్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, ఐషర్ మోటార్స్, హీరో మోటోకార్ప్, శ్రీ సిమెంట్, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, విప్రో 1-3.5 శాతం ఎగిసాయి. మరోవైపు అదానీ పోర్ట్స్, టీసీఎస్, హెచ్‌డిఎఫ్‌సి, టాటా స్టీల్, గెయిల్, జెఎస్‌డబ్ల్యు స్టీల్,భారత్ పెట్రోలియం, హెచ్‌డీఎఫ్‌సీ నష్టపోతున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement