Rent In Bangalore Gets Costlier 2 BHK Costs Rs 50000, Says Survey - Sakshi
Sakshi News home page

ఇదెక్కడి డిమాండ్‌ మహాప్రభో.. డబుల్‌ బెడ్‌ రూం అద్దె రూ.50వేలు!

Apr 4 2023 3:12 PM | Updated on Apr 4 2023 3:51 PM

Rent In Bangalore Gets Costlier 2 Bhk Costs Rs 50000 Says Survey - Sakshi

దేశంలో ఐటీ కంపెనీల ప్రస్తావనకొస్తే గుర్తొచ్చే మొదటి నగరం బెంగళూరు. ఈ నగరానికి సిలికాన్‌ సిటీ అని పేరున్నప్పటికీ అక్కడ కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఆధారంగా కాస్ట్లీ సిటీ అని కూడా పిలవచ్చు. కరోనా ఎఫెక్ట్‌తో బెంగళూరులో గతేడాది వరకు అద్దె ఇళ్లులు తక్కువ ధరకే లభ్యమయ్యేవి. కానీ ఇటీవల ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.  2022 ఆరంభంతో పోలిస్తే ఇటీవల దాదాపు రెండింతలయ్యాయి. దీంతో దేశంలోనే బెంగళూరు అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్‌ మార్కెట్‌గా మారింది.

అమాంతం పెరిగిన అద్దె
‘సిలికాన్‌ వ్యాలీ ఆఫ్‌ ఇండియా’గా పిలిచే బెంగళూరులో  ఇంటి యజమానులు ప్రస్తుతం తమ ఆదాయంలో అధిక భాగం అద్దెల నుంచే పొందుతున్నట్లు పలు మార్కెట్‌ రీసెర్చ్‌ నివేదికలు పేర్కొన్నాయి. కర్నాటక రాష్ట్ర రాజధానిలో స్టార్టప్‌ల నుంచి దిగ్గజ గ్లోబల్ సంస్థలు నెలకొన్న సంగతి తెలిసిందే.

దీంతో 1.5 మిలియన్లకు పైగా ఉద్యోగులు బెంగళూరులో నివసించడంతో ఇంటి అద్దె ధరలు కిందకి దిగేవి కావు. అయితే కోవిడ్ సమయంలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కారణంగా చాలా మంది తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లారు. దీంతో నగరంలో అద్దె గదులు వెలవెలబోయాయి. చివరికి అపార్ట్‌మెంట్లను సైతం తక్కువ ధరలకు అద్దెకు ఇవ్వాల్సి వచ్చింది. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో ప్రజలు ఆఫీసుల బాట పడుతున్నారు. ఈ క్రమంలో ఇంటి యజమానులు తమ నష్టాలను అధిక అద్దెలతో భర్తీ చేస్తున్నారు.


బెంగళూరులో ప్రస్తుతం ‘రెంటల్‌ మార్కెట్‌’కు మంచి డిమాండ్‌ ఉందని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్‌లో రీసెర్చ్ విభాగాధిపతి ప్రశాంత్‌ ఠాకూర్‌ తెలిపారు. కొవిడ్‌ సమయంలో ఖాళీగా ఉన్న అపార్ట్‌మెంట్లన్నీ ఇప్పుడు భర్తీ అవుతున్నట్లు తెలిపారు. ఒక్కసారిగా డిమాండ్‌ పెరగడంతో అద్దెకు ఇళ్లు దొరకడం కష్టంగా మారిందని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement