
టాటా ట్రస్ట్ ఛైర్మన్గా రతన్ టాటా సోదరుడు నోయెల్ టాటా ఏకగ్రీవంగా నియమితులయ్యారు. టాటా సామ్రాజ్యానికి కీలకమైన దాతృత్వ సంస్థలను నిర్వహిస్తున్న టాటా ట్రస్టుకు అధిపతిని నియమించేందుకు శుక్రవారం సభ్యులు సమావేశమయ్యారు. అందులో రతన్ టాటా సోదరుడు నోయెల్ టాటాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు.
టాటా స్వచ్ఛంద సంస్థలకు బోర్డు ట్రస్టీగా ఉన్న మెహ్లీ మిస్త్రీ కూడా కీలక పదవిని పొందేందుకు అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకు టాటా ట్రస్ట్కు ఛైర్మన్గా ఉన్న రతన్టాటా(86) ఆరోగ్య సమస్యలతో మరణించడంతో తన స్థానంలో తదుపరి ట్రస్ట్ పగ్గాలు చేపట్టేది ఎవరనే చర్చసాగింది. బోర్డు సభ్యులు నోయెల్ టాటాను ఎకగ్రీవంగా ఎన్నుకోవడంతో ఈ చర్చలకు తెరపడినట్లయింది.
రతన్ టాటా వివాహం చేసుకోలేదు. వారసులు లేకపోవడంతో తన సోదరుడు నోయెల్ టాటా ట్రస్ట్ పగ్గాలు చేపట్టాల్సి వచ్చిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. నవల్ టాటా, సిమోన్ టాటా దంపతులకు 1957లో నోయెల్ టాటా జన్మించారు. అతను ససెక్స్ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొందారు. ఫ్రాన్స్లోని ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్కు ఎంపికయ్యారు. నోయెల్ టాటా గ్రూప్లో వివిధ నాయకత్వ హోదాల్లో విధులు నిర్వహించారు.

ఇదీ చదవండి: టెస్లా రోబోవ్యాన్, సైబర్ క్యాబ్ ఆవిష్కరణ
ట్రెంట్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా, టాటా ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్గా, టైటాన్ కంపెనీ, టాటా స్టీల్ వైస్ ఛైర్మన్గా కూడా పనిచేశారు. 2010-2021 మధ్య అతని నాయకత్వంలో ఉన్న టాటా ఇంటర్నేషనల్ ఆదాయాన్ని 500 మిలియన్ డాలర్లు(రూ.4200 కోట్లు) నుంచి మూడు బిలియన్ డాలర్లు(రూ.25 వేలకోట్లు)కు చేర్చారు. 1998లో ట్రెంట్ కంపెనీ ఆధ్వర్యంలో ఒకే రిటైల్ స్టోర్ ఉండేది. దాన్ని దేశంవ్యాప్తంగా వ్యాపింపజేసి 700 స్టోర్లకు పెంచారు.