న్యూఢిల్లీ: అంతర్జాతీయ బలహీన ట్రెండ్స్, రూపాయి బలపడటం తదితర అంశాల నేపథ్యంలో పసిడి ధర నెమ్మదించింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9% స్వచ్ఛత గల 10 గ్రా. బంగారం ధర రూ. 1,400 తగ్గి రూ. 1,49,250కి పరిమితమైంది. వెండి కేజీ రేటు రూ. 200 తగ్గి రూ. 2,39,800కి చేరింది.
అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ సమావేశ మినిట్స్, నిరుద్యోగ గణాంకాలు, ద్రవ్యోల్బణం డేటా గురించి ఎదురుచూస్తున్న ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు కోటక్ సెక్యూరిటీస్ ఏవీపీ కైనాత్ చైన్వాలా తెలిపారు. రూపాయి మారకం విలువ 48 పైసలు బలపడటం కూడా బంగారంపై ప్రభావం చూపింది. అటు అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో ఔన్సు (31.1 గ్రాములు) పసిడి రేటు 24.54 డాలర్లు క్షీణించి 4,140.59 డాలర్లకు, వెండి దాదాపు 2% తగ్గి 60.89 డాలర్లకు చేరింది.


