
న్యూఢిల్లీ: మారిటైమ్ ఇండియా 2021 సదస్సు మంగళవారం జరగనుంది. వర్చువల్గా జరిగే ఈ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. రష్యా, అమెరికా, డెన్మార్క్, అఫ్గానిస్తాన్, ఇరాన్, ఖతార్ తదితర దేశాలు పాల్గొననున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా రూ.3.39 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించొచ్చని కేంద్రం భావిస్తోంది. సదస్సులో పాల్గొనేందుకు మంచి స్పందన కనిపిస్తోందని ఇప్పటి వరకు రూ.1.70 లక్షల రిజిస్ట్రేషన్లు నమోదైనట్టు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.
పోర్టులు, షిప్పింగ్, జల మార్గాల శాఖ రూ.3.39 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి అవగాహన ఒప్పందాలను (ఎంవోయూలు) రూపొందించే పనిలో ఉందని కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఒప్పందాలపై ఈ ఏడాది మార్చి 2–4 మధ్య జరిగే మారిటైమ్ ఇండియా రెండో విడత సదస్సులో సంతకాలు చేసే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. తీర రాష్ట్రాలు, భాగస్వాములు ఈ ఒప్పందాలపై సంతకాలు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.