పేటీఎమ్‌: వరుసగా ఏడో ఏటా నష్టాలే | Paytm incurred losses in 7th consecutive year | Sakshi
Sakshi News home page

పేటీఎమ్‌: వరుసగా ఏడో ఏటా నష్టాలే

Dec 24 2020 8:55 AM | Updated on Dec 24 2020 9:10 AM

Paytm incurred losses in 7th consecutive year - Sakshi

ముంబై, సాక్షి: దేశంలోనే అతిపెద్ద ఫిన్‌టెక్‌ స్టార్టప్‌ పేటీఎమ్‌ వరుసగా ఏడో ఏడాదిలోనూ నష్టాలు నమోదు చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం(2019-20)లో రూ. 2,833 కోట్ల నష్టం నమోదైంది. వెరసి పేటీఎమ్‌ మాతృ సంస్థ వన్‌97 వరుసగా ఏడో ఏడాదీ నష్టాలను సాధించినట్లయ్యింది. అయితే అంతక్రితం ఏడాదితో పోలిస్తే నష్టాలు 28 శాతం తగ్గాయి. అంతేకాకుండా వ్యయాలను సైతం 20 శాతం తగ్గించుకుంది. దీంతో ఇవి రూ. 5,861 కోట్లకు చేరాయి. టోఫ్లర్‌ వివరాల ప్రకారం గతేడాది పేటీఎమ్‌ రూ. 3,350 కోట్ల ఆదాయం సాధించింది. ఇది అంతక్రితం ఏడాదితో పోలిస్తే 1 శాతం తక్కువ. (యూనికార్న్‌కు చేరిన డైలీహంట్ స్టార్టప్‌)

2022కల్లా
వచ్చే ఏడాది(2021-22)కల్లా నష్టాలను వీడి లాభాల్లోకి ప్రవేశించాలని వన్‌97 లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బాటలో పలు ఫైనాన్షియల్‌ సర్వీసుల బిజినెస్‌లలోకి అడుగుపెట్టింది. రుణాలు, బీమా, వెల్త్‌ మేనేజ్‌మెంట్‌, కామర్స్‌ తదితర విభాగాలలోకి కార్యకలాపాలు విస్తరించింది. కాగా.. యూనిఫైడ్‌ పేమెంట్ విభాగంలో ఈవ్యాలెట్‌ బిజినెస్‌కు పోటీ తీవ్రమైనట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. గూగుల్‌ పే, వాల్‌మార్ట్‌కు చెందిన ఫోన్‌ పే, మొబిక్విక్‌, భారత్‌ పే,అమెజాన్‌ పే తదితరాలు ఈవ్యాలెట్‌ సర్వీసులను అందిస్తున్న సంగతి తెలిసిందే. (స్టేట్ బ్యాంక్- రుపీక్ జత?)

1.7 కోట్ల మర్చంట్స్
పేటీఎమ్‌ ప్లాట్‌ఫామ్‌లో 1.7 కోట్ల చిన్నతరహా బిజినెస్‌లు లిస్టయ్యాయి. ఈ కంపెనీలు క్యూఆర్‌ కోడ్‌ విధానం ద్వారా సూక్ష్మ స్థాయి చెల్లింపులను సాధిస్తున్నాయి. తద్వారా చిన్సస్థాయి డిజిటల్‌ చెల్లింపులు ఊపందుకున్నట్లు టోఫ్లర్‌ పేర్కొంది. కంపెనీ ఇటీవల బిజినస్‌ యాప్‌, సౌండ్‌బాక్స్‌, బిజినెస్‌ కాటా తదితర మర్చంట్ మేనేజ్‌మెంట్‌ సర్వీసులను ప్రారంభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement