మధ్యప్రదేశ్లోని చారిత్రక నగరమైన ఖజురహోలో ప్రతిష్టాత్మకమైన ‘ది ఒబెరాయ్ రాజ్గఢ్ ప్యాలెస్’ను ప్రారంభిస్తున్నట్లు ఒబెరాయ్ గ్రూప్ ప్రకటించింది. ఇది 76 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 350 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్యాలెస్. ఈ చారిత్రక వారసత్వ కట్టడాన్ని ఇటీవల ఒబెరాయ్ గ్రూప్ పునరుద్ధరించింది. సహజ సరస్సు, మనియాఘర్ కొండల వాలుపై సాల్, పలాష్ అడవుల మధ్య వింధ్యాచల్ పర్యాత శ్రేణుల్లో ఈ ప్యాలెస్ ఉంది.
యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద అయిన ఖజురహో దేవాలయాలు, పన్నా నేషనల్ పార్క్కు సమీపంలో ఈ హోటల్ ఉండటం వల్ల చాలా మంది ఇందులో బస చేసేందుకు అవకాశం ఉందని ఒబెరాయ్ గ్రూప్ తెలిపింది. ది ఒబెరాయ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అర్జున్ ఒబెరాయ్ ఈ పునరుద్ధరణపై స్పందిస్తూ చరిత్రకు తిరిగి జీవం పోసే ప్రయాణంగా దీన్ని అభివర్ణించారు. ఖజురహోలో బుండేలా స్మారక చిహ్నం సమగ్రతను కాపాడుతూనే, ఆధునిక సౌకర్యాలను జోడించినట్లు తెలిపారు.
ఈ ఎస్టేట్లో మొత్తం 65 గదులు, సూట్ రూమ్లున్నట్లు కంపెనీ తెలిపింది. వీటిలో ప్యాలెస్ సూట్లు, ప్రైవేట్ పూల్ విల్లాలు, తోటలు/ టెర్రస్లతో కూడిన రూమ్స్ ఉన్నాయి. వీటిలో కోహినూర్ సూట్ అత్యంత ప్రత్యేకమైనదని కంపెనీ చెప్పింది. ప్యాలెస్ గదుల నుంచి చుట్టూ ప్రదేశాల 360 డిగ్రీల వ్యూను ఆస్వాదించవచ్చని పేర్కొంది.
ఇదీ చదవండి: రికార్డు స్థాయిలో చమురు దిగుమతులు


