కొత్త కార్ల ‘పండుగ’! | New Cars Introducing From Brand Companies For Vinayaka Chavithi Festival | Sakshi
Sakshi News home page

రోడెక్కనున్న 12 కొత్త మోడళ్లు!

Aug 12 2020 7:44 AM | Updated on Aug 12 2020 8:26 AM

New Cars Introducing From Brand Companies For Vinayaka Chavithi Festival - Sakshi

రోనా కష్టకాలంలోనూ కొత్త కార్లు రోడెక్కడానికి సిద్ధమయ్యాయి. పండుగ సీజన్‌ను సెంటిమెంట్‌ను ఆసరా చేసుకొని ప్రముఖ కార్ల కంపెనీలు భారత మార్కెట్లోకి దాదాపు 12రకాల స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్స్‌(ఎస్‌యూవీ)మోడళ్లను విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. భారత్‌లో ఈ ఆగస్ట్‌ 22న వినాయక చవితితో పండుగ సీజన్‌ ప్రారంభం కానుంది. సాధారణంగా కార్ల కంపెనీలు పండుగ సీజన్‌ను క్యాష్‌ను చేసుకునేందుకు తమ కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తుంటాయి. ఈసారి కంపెనీలకు పండుగ సీజన్‌ మరింత కీలకం కానుంది. కరోనా అనంతరం కార్లకు పెరిగిన డిమాండ్‌తో పాటు అంటువ్యాధి కారణంగా ఏర్పడిన అంతరాయంతో ఈసారి విక్రయాలు భారీగా ఉండవచ్చని కంపెనీలు ఆశిస్తున్నాయి. 

హ్యుందాయ్‌ నుంచి 4 మోడళ్లు
పండుగ సీజన్‌ సందర్భంగా హ్యుందాయ్‌ కంపెనీ ఎస్‌యూవీ విభాగంలో 4మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా కంపెనీ తన ప్లాంట్లలో 3 షిఫ్టుల్లో కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ‘‘ఈ ఆగస్ట్‌లో కంపెనీ నిర్వహణ సామర్థ్యం 90–92శాతంగా ఉంది. రానున్నరోజుల్లో  మరింత పెంచే అవకాశం ఉంది. సెప్టెంబర్‌ నాటికి ప్రీ–కోవిడ్‌ స్థాయి ఉత్పత్తిని అందుకుంటాము’’ అని హ్యుందాయ్‌ మోటర్‌ ఇండియా తెలిపింది.  

టొయోటా నుంచి బడ్జెట్‌ కారు: 
దీపావళి పండుగ సందర్భంగా జపాన్‌కు చెందిన టొయోటా కిర్లోస్కర్‌ భారత మార్కెట్లోకి బడ్జెట్‌ కారును విడుదల చేయనుంది. ఈ కాంపాక్ట్‌ ఎస్‌యూవీకి ’అర్బన్‌ క్రూయిజర్‌’ అనే పేరును ఖరారు చేసింది. ఈ మోడల్‌ కారు ధర రూ.8నుంచి రూ. 11లక్షల మధ్య ఉండొచ్చని పరిశ్రమ వర్గాల అం చనా. కొత్తగా కారును కొనాలనుకునేవారు ఈ మో డల్‌ పట్ల ఆకర్షితులవుతారని కంపెనీ ఆశిస్తోంది. 

కియా నుంచి కూడా...
దక్షిణ కొరియా దిగ్గజం కియా మోటర్స్‌ కూడా వచ్చే సెప్టెంబర్‌లో కాంపాక్ట్‌ ఎస్‌యూవీ ‘సోనెట్‌’ను విడుదల చేయనుంది. భారత్‌లో సెల్టోస్, కార్నివాల్‌ తర్వాత ‘సోనెట్‌’ మూడో మోడల్‌ కావడం విశేషం. దేశీయ మార్కెట్లో హ్యుం దాయ్‌ వెన్యూ, మారుతీ విటారా బ్రెజా, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ 300 మోడళ్లతో ఇది పోటీ పడే అవకాశం ఉంది. ఈ మోడల్‌ ధర రూ.7నుంచి రూ.12లక్షల మధ్య ఉండొచ్చు. 

ఆగస్ట్‌ 15న మహీంద్రా థార్‌ లాంచ్‌
దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా కంపెనీ తన కొత్త మోడల్‌ 2020 థార్‌ మోడల్‌ కారును ఆగస్ట్‌ 15న భారత మార్కెట్లో ఆవిష్కరించనుంది. ఈ ఏడాది ప్రారంభంలోనే విడుదల కావాల్సిన 2020 థార్‌ మోడల్‌ లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ఈ థార్‌ మోడల్‌ కారు డీజిల్, పెట్రోల్‌ ఇంజన్‌ ఆప్షన్‌లో లభిస్తోంది.  ఫ్రెంచ్‌ కార్‌ బ్రాండ్‌ రెనాల్ట్‌ సబ్‌–కాంపాక్ట్‌ విభాగంలో తన కొత్త మోడల్‌ కారును దీపావళికి విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. అలాగే ఎంజీ గ్లస్టర్, డస్టర్‌ ఎస్‌యూవీలు ఈ పండుగ సీజన్‌లో భారత్‌ మార్కెట్లోకి విడుదల కానున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement