మార్కెట్ల పతనం- బ్యాంకులు బేర్‌ | Market tumbles on selloff in Banks- rally breaks | Sakshi
Sakshi News home page

మార్కెట్ల పతనం- బ్యాంకులు బేర్‌

Nov 19 2020 3:57 PM | Updated on Nov 19 2020 4:13 PM

Market tumbles on selloff in Banks- rally breaks - Sakshi

ముంబై, సాక్షి: దీపావళి జోష్‌ను కొనసాగిస్తూ రికార్డుల ర్యాలీ చేస్తున్న దేశీ స్టాక్‌ మార్కెట్లకు చివరికి బ్రేక్‌ పడింది. మిడ్‌సెషన్‌ నుంచీ ప్రధానంగా అమ్మకాలు వెల్తువెత్తడంతో మార్కెట్లు పతనమయ్యాయి. వెరసి సెన్సెక్స్‌ 580 పాయింట్లు కోల్పోయి 43,600 వద్ద ముగిసింది. నిఫ్టీ 166 పాయింట్లు నష్టపోయి 12,772 వద్ద నిలిచింది. ఆటుపోట్ల మధ్య ప్రారంభమైన మార్కెట్లు తదుపరి కొంతమేర కోలుకున్నాయి. అయితే అమెరికన్‌ మార్కెట్ల బాటలో యూరోపియన్‌ మార్కెట్లు సైతం తాజాగా 1 శాతం స్థాయిలో క్షీణించడంతో సెంటిమెంటు బలహీనపడింది. సెకండ్‌ వేవ్‌లో భాగంగా కోవిడ్‌-19 కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లలో తిరిగి లాక్‌డవున్‌ అందోళనలు తలెత్తినట్లు నిపుణులు తెలియజేశారు. దీనికితోడు దేశీ మార్కెట్లలో నిరవధిక ర్యాలీ కారణంగా ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడం ప్రభావం చూపినట్లు వివరించారు. చదవండి: (రికార్డుల ర్యాలీకి బ్రేక్‌.. నష్టాలతో షురూ)

బ్యాంక్స్‌ బోర్లా
ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ అత్యధికంగా 3 శాతం నీరసించింది. రియల్టీ, ఐటీ, మెటల్‌, ఆటో సైతం 1.4-0.7 శాతం మధ్య డీలాపడ్డాయి. అయితే ఎఫ్‌ఎంసీజీ, మీడియా 0.4 శాతం స్థాయిలో పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్‌, టాటా మోటార్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, అల్ట్రాటెక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐషర్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ 5-3 శాతం మధ్య పతనమయ్యాయి. ఇతర బ్లూచిప్స్‌లో పవర్‌గ్రిడ్‌, ఐటీసీ, ఎన్‌టీపీసీ, కోల్‌ ఇండియా, టాటా స్టీల్‌, టైటన్‌, బ్రిటానియా, టీసీఎస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ మాత్రమే ప్రస్తావించదగ్గ స్థాయిలో 2.6-0.5 శాతం మధ్య బలపడ్డాయి.

ఫైనాన్స్‌ వీక్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో ఫెడరల్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, నౌకరీ, బీవోబీ, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, డీఎల్‌ఎఫ్‌, పీఎన్‌బీ, ఐసీఐసీఐ ప్రు, పేజ్‌ 5.5-2.6 శాతం మధ్య వెనకడుగు వేశాయి. కాగా.. మరోవైపు టాటా కెమ్‌, బీఈఎల్‌, బాటా, బాష్‌, వేదాంతా, కమిన్స్‌, జిందాల్‌ స్టీల్‌, భెల్‌, ఎంఆర్ఎఫ్‌, నాల్కో 8-2.5 శాతం మధ్య జంప్‌చేశాయి. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ 0.7 శాతం నీరసించింది. ట్రేడైన షేర్లలో 1,433 నష్టపోగా.. 1,324 లాభాలతో ముగిశాయి. 

ఎఫ్‌పీఐల ఇన్వెస్ట్‌మెంట్స్‌
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 3,072 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 2,790 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 4,905 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 3,829 కోట్ల అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement