నెటిజన్ పోస్టుకు ఆనంద్ మహీంద్రా రిప్లై: ఎంత దూరం.. | Man Criticises Mahindra Car Designs And Anand Mahindra Reply | Sakshi
Sakshi News home page

నెటిజన్ పోస్టుకు ఆనంద్ మహీంద్రా రిప్లై: ఎంత దూరం..

Dec 2 2024 3:11 PM | Updated on Dec 2 2024 5:07 PM

Man Criticises Mahindra Car Designs And Anand Mahindra Reply

ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉండే ప్రముఖ పారిశ్రామిక దిగ్గజంగా 'ఆనంద్ మహీంద్రా'.. తాజాగా ఓ నెటిజన్ చేసిన పోస్టుపై స్పందించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఇటీవల దేశీయ మార్కెట్లో బీఈ 6ఈ, ఎక్స్ఈవీ 9ఈ కార్లను లాంచ్ చేసిన తరువాత.. సుశాంత్ మెహతా తన ఎక్స్ ఖాతాలో కార్ల డిజైన్ గురించి, సర్వీస్ క్వాలిటీ వంటి వాటిపై విమర్శిస్తూ ట్వీట్ చేశారు. అంతే కాకుండా.. మీరు ఇప్పటికే ఉన్న కార్లు, సర్వీస్ సెంటర్లు, విడిభాగాల సమస్యలు, ఉద్యోగుల ప్రవర్తనలకు సంబంధించిన.. గ్రౌండ్ లెవల్ సమస్యలను ముందుగా పరిష్కరించుకోవాలని అన్నారు.

మీ కార్ల డిజైన్స్ విషయానికి వస్తే.. అవన్నీ హ్యుందాయ్ కార్లకు సమీపంలో కూడా ఎక్కడా నిలబడలేవు. బీఈ 6ఈ కారు లుకింగ్ కూడా వింతగానే ఉందని పేర్కొన్నాడు. మీ డిజైన్ టీమ్ ఇలాగే ఆలోచిస్తోందా? లేదా మీకు డిజైన్ మీద సరైన అవగాహనా లేదా? అని విమర్శించాడు. అంతే కాకుండా మహీంద్రా కంపెనీ మాత్రమే కాకుండా.. టాటా కంపెనీ కూడా ప్రపంచ స్థాయి కార్లను తయారు చేయాలని ఆశిస్తున్నాను. కానీ నాకు ఇప్పటికీ నిరాశే మిగిలిందని అన్నాడు.

దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. మీరు చెప్పింది నిజమే సుశాంత్. మనం చాలా దూరం వెళ్ళాలి. అయితే మనం ఎంత దూరం వచ్చామన్న విషయాన్ని కూడా ఆలోచించండి. నేను 1991లో కంపెనీలో చేరాను. అప్పుడే భారత్ ప్రపంచీకరణకు తలుపులు తెరిచింది. దేశంలోకి అడుగుపెట్టే కార్లు.. గ్లోబల్ బ్రాండ్లతో పోటీపడలేవని, ఈ రంగం నుంచి తప్పకోవాలని ఓ సంస్థ సలహా ఇచ్చింది. అయినప్పటికీ మేము మూడు దశాబ్దాలుగా కార్లను తయారు చేస్తూ.. అనేక ప్రపంచ బ్రాండ్ వాహనాలకు గట్టి పోటీ ఇస్తున్నాము. ఎటువంటి ఆత్మసంతృప్తికి మేము ఆస్కారం లేదు. నిరంతర అభివృద్ధి మా మంత్రంగా కొనసాగుతుంది. మమ్మల్ని మరింత రగిల్చినందుకు ధనవ్యవాదాలు.. అంటూ ట్వీట్ చేసారు.

మహీంద్రా ట్వీట్ చూసిన నెటిజన్లు తమదైన రీతిలో స్పందించారు. ఆనంద్ మహీంద్రా సానుకూల ప్రతి స్పందనను కొనియాడారు. దేశంలో మారుతి సుజుకి, హ్యుందాయ్ బ్రాండ్ కార్ల కంటే మహీంద్రా, టాటా కార్లు చాలా సురక్షితమైనవి పేర్కొన్నారు.

ఆనంద్ మహీంద్రా స్పందనకు సుశాంత్ మెహతా సైతం ఫిదా అయిపోయాడు. నేను చేసిన విమర్శను కూడా స్వీకరిస్తూ.. సమాధానం ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. నా ట్వీట్ చూసి మీ టీమ్ కాల్ చేసింది. వారు బహుశా హర్ట్ అయ్యి ఉంటారని నేను భావించాను. అందుకే ట్వీట్ డిలీట్ చేశా అని మరో ట్వీట్ ద్వారా పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement