సెల్‌ ఫోన్‌ వాడకం..యాప్స్‌పై గడిపే సమయం సుమారు రోజుకు 5 గంటలు

Indians Spend 5 Hours On Smartphone Apps Daily   - Sakshi

కరోనా కారణంగా స్మార్ట్‌ ఫోన్‌ వినియోగం పెరిగిపోయింది. నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు సెల్‌ ఫోన్‌ను విపరీతంగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా సెల్‌భూతం యువతను పట్టిపీడిస్తోంది. చేతిలో పెద్ద అణుబాంబుగా తయారైంది. అవసరం లేకపోయినా సెల్‌ఫోన్‌లో ఎక్కువ సేపు మాట్లాడటం..గంటల తరబడి ఫేస్‌బుక్, వాట్సాప్‌ గ్రూప్‌లో చాటింగ్స్‌ చేయడం...రాత్రంతా ఫోన్‌ను పక్కన పెట్టుకుని యూట్యూబ్‌లో వీడియోలు చూస్తున్నారు. దీంతో ఎక్కువ సేపు మొబైల్‌తో పాటు యాప్స్‌ను వినియోగిస్తున్న ప్రపంచ దేశాల సరసన భారత్‌ చేరింది. 

ఇటీవల మొబైల్‌ రీసెర్చ్‌ సంస్థ 'అన్నీ యాప్‌' (Annie app)ఇంటర్నెట్‌లో ప్రపంచ దేశాల ప్రజలతో పాటు భారతీయులు ఎంత సేపు యాప్స్‌పై గడుపుతున్నారనే అంశంపై స్టడీ చేసింది. ఈ స్టడీలో భారతీయులు యాప్స్‌లలో ప్రతీరోజూ 4.8గంటలు గడిపేస్తున్నట్లు తేలింది.

ఏఏ దేశాలున్నాయి
సంస్థ అన్నీ యాప్‌ నిర్వహించిన స్టడీలో..యాప్స్‌ ఎక్కువ వినియోగిస్తున్న దేశాల్లో ఇండోనేషియా(5.5గంటలు), బ్రెజిల్‌ (5.4గంటలు),సౌత్‌ కొరియా(5.0గంటలు), ఇండియన్స్‌ (4.8గంటలు) తొలి స్థానాల్లో ఉండగా.. జపాన్‌, కెనడా,యూఎస్‌,రష్యా,టర్కీ, యూకే దేశాల్లో ఉన్నాయి. 

ఏ యాప్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారు 
వరల్డ్‌ వైడ్‌గా ఎక్కువగా టిక్‌ టాక్‌ను వినియోగిస్తున్నట్లు తేలింది. ఒక్క సెప్టెంబర్‌ నెలలో వన్‌ బిలియన్‌ మంది యూజర్లు టిక్‌ టాక్‌ ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. టిక్‌ టాక్‌ తర్వాత వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, టెలిగ్రామ్‌, జూమ్‌ యాప్స్‌ వినియోగం పెరిగినట్లు తెలుస్తోంది. జనవరి నుంచి జూన్‌ వరకు పై యాప్స్‌ను వినియోగించగా.. జులై నుంచి ఎక్కువ మంది సోషల్‌ మీడియాలో గడుపుతున్నట్లు తేలింది. 

సెల్‌ ఫోన్‌లు మోగుతున్నాయి... టీవీలు మూగబోతున్నాయి
ఇక సర్వేలో మరో ఆసక్తికర విషయం ఏంటంటే దశాబ్ధం క్రితం ప్రజలు ప్రతిరోజు  3 గంటల పాటు టీవీలకు అతుక‍్కుపోతుంటే ఇప్పుడు ఆ సమయం తగ్గి 2.5గంటలకు చేరింది. ఇక ఫోన్‌ యూజర్ల కోసం ఊబర్‌, ఓలా,స్విగ్గీ,జొమోటా, అర్బన్‌ కంపెనీలు రీజీనల్‌ కంటెంట్‌తో అట్రాక్ట్‌ చేస్తున్నాయి. అర్బన్‌ ఏరియాల్లో సైతం ఇళ్లల్లో స్మార్ట్‌ ఫోన్‌లు, ఇంటర్నెట్‌ వాడకం తప్పని సరైంది. మహమ్మారి కారణంగా టెక్నాలజీ వినియోగం పెరిగిరింది. ముఖ్యంగా లాక్‌ డౌన్‌ అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్,హాట్‌స్టార్ లాంటి ఓటీటీ ఫ్లాట్‌ ఫాంల అవసరం ఎలా ఉందో తెలిసొచ్చింది. దీంతో యాప్స్‌ వినియోగం భారీగా పెరిగిపోతున్నట్లు అన్నీ యాప్ అభిప్రాయం వ్యక్తం చేసింది. 

లెక్కలు ఏం చెబుతున్నాయి
స్టాటిస్టా లెక్కల ప్రకారం.. 2020లో మనదేశంలో ఇంటర్నెట్‌ యూజర్ల సంఖ్య 749 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు. అందులో 744మిలియన్ల మంది ఇంటర్నెట్‌ను సెల్‌ఫోన్‌ నుంచి వినియోగిస్తున్నారు. 2040 నాటికి ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య 1.5 బిలియన్లకు చేరనున్నట్లు స్టాటిస్టా తన రిపోర్ట్‌లో వెల్లడించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top