
ఆగస్టు ద్రవ్యోల్బణం 1.31 శాతం
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఆగస్టులో 1.31 శాతంగా (2023 ఇదే నెలతో పోల్చి) నమోదయ్యింది. గడచిన 4 నెలల్లో ఇంత తక్కువస్థాయి టోకు ద్రవ్యోల్బణం నమోదుకావడం గమనార్హం. కూరగాయలు, ఇంధనం ధరలు తగ్గడం దీనికి ప్రధాన కారణం.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం కూడా జూలై, ఆగస్టుల్లో 4% లక్ష్యాల దిగువకు (వరుసగా 3.6 శాతం, 3.65 శాతం) చేరిన సంగతి తెలిసిందే. తాజా టోకు గణాంకాల్లో ఫుడ్ ఐటమ్స్ ద్రవ్యోల్బణం 3.11% గా నమోదయ్యింది. కూరగాయల ధరలు 10% తగ్గాయి. అయితే ఆలూ, ఉల్లి ధరలు భారీగా 77.96%, 65.75% చొప్పున పెరిగాయి.