సంపన్నులకు కలిసిరాని 2022.. బిలియనీర్‌ క్లబ్‌ నుంచి 22 అవుట్‌!

India: Billionaires Lost Their Wealth In 2022 Says Report - Sakshi

న్యూఢిల్లీ: ఐశ్వర్యవంతులకు ఈ ఏడాది అచ్చిరాలేదు. మార్కెట్ల పతనంతో బిలియనీర్ల స్థానాలు చెల్లా చెదురయ్యాయి. బడా బిలియనీర్లు మరింత బలపడితే.. బిలియనీర్‌ క్లబ్‌ (కనీసం బిలియన్‌ డాలర్లు అంతకుమించి సంపద ఉన్నవారు)లో దిగువన ఉన్నవారు ఏకంగా ఆ హోదానే కోల్పోవాల్సి వచ్చింది. ఒక్క అదానీ గ్రూపు చైర్మన్‌ గౌతమ్‌ అదానీకి 2022ను జాక్‌పాట్‌ సంవత్సరంగా చెప్పుకోవాలి. ఎందుకంటే దేశ కుబేరుడిగా ఉన్న ముకేశ్‌ అంబానీని వెనక్కి నెట్టి, దేశంలోనే అత్యంత ఐశ్వర్యమంతుడిగా మొదటి స్థానానికి చేరుకోవడమే కాదు.. ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానానికి ఎగబాకారు.

2021 చివరికి అదానీ నెట్‌వర్త్‌ (సంపద విలువ) 80 బిలియన్‌ డాలర్లు ఉండగా, ఏడాది తిరిగేసరికి 70 శాతం పెరిగి 135.7 బిలియన్‌ డాలర్లకు చేరింది. బ్లూంబర్గ్‌ గణాంకాల ప్రకారం ఆసియాలోనూ అదానీయే నంబర్‌ 1గా ఉన్నారు. డాలర్‌ మారకంలో బిలియనీర్‌ ప్రమోటర్ల సంఖ్య ఈ ఏడాది 120కి తగ్గింది. 2021 చివరికి వీరి సంఖ్య 142గా ఉంది. అయితే 24 మంది ప్రమోటర్లు బిలియనీర్‌ క్లబ్‌లో స్థానం కోల్పోగా.. కొత్తగా ఐఐఎఫ్‌ఎల్‌ ప్రమోటర్లు ఇద్దరు ఉమ్మడిగా, క్యాప్రిగ్లోబల్‌ ప్రమోటర్‌ ఇందులోకి వచ్చి చేరారు. బిలియనీర్ల ఉమ్మడి సంపద సైతం ఈ ఏడాది కొంత కరిగిపోయింది. 8.8 శాతం క్షీణించి 685 బిలియన్‌ డాలర్లకు (రూ.56.62 లక్షల కోట్లు) పరిమితమైంది. 2021 చివరికి వీరి ఉమ్మడి సంపద విలువ 751.6 బిలియన్‌ డాలర్లుగా ఉండడాన్ని గమనించొచ్చు. దేశంలోని టాప్‌–10 సంపన్న పారిశ్రామికవేత్తల్లో ఈ ఏడాది గౌతమ్‌ అదానీతోపాటు, సన్‌ ఫార్మా దిలీప్‌ సంఘ్వి, భారతీ ఎయిర్‌టెల్‌ సునీల్‌ భారతీ మిట్టల్‌ మినహా మిగిలిన ఏడుగురి సంపద విలువ క్షీణించింది.  

ముకేశ్‌ సంపద 102 బిలియన్‌ డాలర్లు 
రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ స్థానచలనం పొందారు. 2021 చివరికి జాబితాలో మొదటి స్థానంలో ఉండగా, దీన్ని గౌతమ్‌ అదానీకి కోల్పోయి రెండో స్థానంలోకి వచ్చారు. ముకేశ్‌ అంబానీ కుటుంబ సంపద విలువ 2.5 శాతం క్షీణించి గతేడాది చివరికి ఉన్న 104.4 బిలియన్‌ డాలర్ల నుంచి 101.75 బిలియన్‌ డాలర్లకు పరిమితమైంది. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం, ద్రవ్యోల్బణం పెరుగుదల, కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల పెంపు ప్రభావాలతో ఈ ఏడాది ఈక్విటీ మార్కెట్లు బలహీన పనితీరు చూపించడం, బిలియనీర్ల సంపద తగ్గడానికి గల కారణాల్లో ప్రధానమైనది. టెలికం రంగంలో చిన్నాచితకా కంపెనీలన్నీ మూతపడిపోవడం, చివరికి వొడాఫోన్‌ ఐడియా సైతం బక్కచిక్కడం, టారిఫ్‌లను గణనీయంగా పెంచడంతో ఎయిర్‌టెల్‌ అధినేత సునీల్‌ మిట్టల్‌ సంపద వృద్ధి చెందింది. 

చదవండి: న్యూ ఇయర్‌ ఆఫర్‌: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.14,000 తగ్గింపు.. త్వరపడాలి, అప్పటివరకే!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top