ఐసీఐసీఐ లాభం జూమ్‌

ICICI Bank posts 34percent rise in Q3 PAT to Rs 8,312 cr - Sakshi

డిసెంబర్‌ త్రైమాసికంలో రూ. 8,792 కోట్లు

ముంబై: ప్రయివేట్‌ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌ మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో రూ. 8,792 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 8,312 కోట్లతో పోలిస్తే ఇది 34 శాతం అధికం. నికర వడ్డీ ఆదాయం సైతం 35 శాతం జంప్‌చేసి రూ. 16,465 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 0.7 శాతం బలపడి 4.65 శాతానికి చేరాయి.

త్రైమాసికవారీగా స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 3.19 శాతం నుంచి 3.07 శాతానికి తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి 16.26 శాతంగా నమోదైంది. అనుబంధ సంస్థలలో జీవిత బీమా లాభం రూ. 331 కోట్ల నుంచి రూ. 221 కోట్లకు క్షీణించింది. సాధారణ బీమా లాభం 11 శాతం మెరుగై రూ. 353 కోట్లను తాకింది. అసెట్‌ మేనేజ్‌మెంట్‌ లాభం రూ. 334 కోట్ల నుంచి రూ. 420 కోట్లకు వృద్ధి చూపింది. బ్రోకింగ్‌ విభాగం లాభం రూ. 281 కోట్లకు పరిమితమైంది.

స్లిప్పేజీలు ఇలా...
క్యూ3లో ఐసీఐసీఐ బ్యాంక్‌ స్థూల స్లిప్పేజీలు రూ. 5,723 కోట్లను తాకాయి. వీటిలో రిటైల్, రూరల్‌ బ్యాంకింగ్‌ విభాగం నుంచి రూ. 4,159 కోట్లు, కార్పొరేట్ల నుంచి రూ. 1,500 కోట్లు చొప్పున నమోదయ్యాయి. ఇక రూ. 2,257 కోట్లమేర ప్రొవిజన్లు చేపట్టింది. వీటిలో ప్రుడెన్షియల్‌ కేటాయింపులకింద రూ. 1,500 కోట్లు పక్కనపెట్టింది. దీంతో మొత్తం బఫర్‌ రూ. 11,500 కోట్లకు చేరింది. ఈ కాలంలో కొత్తగా ఏర్పాటు చేసిన 300తో కలిపి మొత్తం బ్రాంచీల సంఖ్య 5,700కు చేరింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top