ఆరోగ్య బీమా క్లెయిమ్ ప్రక్రియలో పారదర్శకత, వేగవంతమైన సేవలు కల్పించే దిశగా బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) పలు కీలక నిబంధనలను తప్పనిసరి చేసింది. పాలసీదారులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉంటే క్లెయిమ్ల విషయంలో అనవసర జాప్యాలు, తిరస్కరణలను నివారించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఐఆర్డీఏఐ మార్గదర్శకాల్లోని వివరాలు కింది విధంగా ఉన్నాయి.
నగదు రహిత (క్యాష్లెస్) చికిత్సలకు సంబంధించి ఆసుపత్రి నుంచి అన్ని పత్రాలు అందిన తర్వాత బీమా సంస్థ ఒక గంటలోపే ఆమోదం తెలియజేయాలి. అలాగే డిశ్చార్జ్ సమయంలో మూడు గంటల్లోపే తుది అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా రోగులు ఆర్థిక ఇబ్బందుల్లేకుండా ఆసుపత్రి నుంచి బయటకు రాగలుగుతారు.
అవసరమైన పత్రాలన్నీ సమర్పించిన తర్వాత సాధారణ క్లెయిమ్లను 30 రోజుల్లోగా, ఇతర పాలసీలను 45 రోజుల్లోగా బీమా సంస్థలు తేల్చాల్సి ఉంటుంది.
ఎనిమిదేళ్ల పాటు నిరంతరాయంగా పాలసీని రెన్యువల్ చేసుకున్న పాలసీదారుల క్లెయిమ్లను, మోసం లేదా మినహాయింపు జాబితాలోని అంశాలు మినహా తిరస్కరించే అవకాశం బీమా సంస్థలకు ఉండదు.
పాలసీదారులు తమకున్న వెయిటింగ్ పీరియడ్ క్రెడిట్లు, నో-క్లెయిమ్ బోనస్లను కోల్పోకుండానే ఒక బీమా సంస్థ నుంచి మరో సంస్థకు మారే వెసులుబాటు కలిగి ఉంటారు.
క్లెయిమ్ తిరస్కరణకు గురైతే అందుకు కారణాలను స్పష్టంగా తెలియజేయాలని బీమా సంస్థను పాలసీదారు కోరే హక్కు ఉంటుంది. అన్యాయం జరిగిందని భావిస్తే బీమా అంబుడ్స్మన్ను ఆశ్రయించే అవకాశం కూడా ఉంది.
ఇదీ చదవండి: నాలుగు ఎకరాలు భూమి కొన్న సచిన్.. ధర ఎంతంటే..


