యువతకు ఉద్యోగావకాశాలు.. కుమారస్వామి కీలక వ్యాఖ్యలు! | HD Kumaraswamy Urges Auto Industry for Youth Job Creation | Sakshi
Sakshi News home page

యువతకు భారీ ఉద్యోగావకాశాలు.. కుమారస్వామి కీలక వ్యాఖ్యలు!

Sep 1 2026 9:04 AM | Updated on Sep 1 2026 9:16 AM

HD Kumaraswamy Urges Auto Industry for Youth Job Creation

దేశంలోని యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించడంలో ఆటోమొబైల్‌ పరిశ్రమ కీలక పాత్ర పోషించాలని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్‌.డి. కుమారస్వామి పిలుపునిచ్చారు. దేశంలో చదువుకున్న యువతకు ఉద్యోగాలు లభించడం కష్టతరంగా మారింది అనేది వాస్తవమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నిర్దేశించిన ‘వికసిత్‌ భారత్‌ 2047’ లక్ష్యాన్ని సాధించడంలో పట్టభద్రులకు ఉద్యోగావకాశాలు కల్పించడం ఎంతో కీలకమన్నారు.

న్యూఢిల్లీలో జరిగిన ‘ఆటోమోటివ్‌ స్కిల్స్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (ఏఎస్‌డీసీ) వార్షిక సదస్సు 2026’లో కుమారస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... ‘‘ప్రతిరోజూ నన్ను కలుస్తున్న యువతను చూస్తే ఉద్యోగం పొందడం ఎంత కష్టంగా ఉందో అర్థమవుతోంది. చదువుకున్న పట్టభద్రులకు కూడా ఉపాధి లభించడం లేదు. ఆటోమొబైల్‌ పరిశ్రమకు చెందిన ప్రతినిధులు ఉద్యోగాల కల్పన అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నా వ్యక్తిగత విన్నపం’’ అని కుమారస్వామి అన్నారు.

కొత్త శకంలోకి ఆటో పరిశ్రమ
ఈవీ మొబిలిటీ, ఆటోమేషన్, కనెక్టెడ్‌ టెక్నాలజీలు, అధునాతన తయారీ, ‘ఇండస్ట్రీ 4.0’ వంటి పరిణామాలతో భారత ఆటోమొబైల్‌ రంగం కొత్త శకంలోకి అడుగుపెడుతోందని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో దేశీయ అవసరాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. స్కిల్లింగ్, అప్‌స్కిల్లింగ్, ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. భారత్‌ కేవలం పెద్ద ఆటోమొబైల్‌ మార్కెట్‌గా కాకుండా ప్రపంచస్థాయి ఆటోమొబైల్‌ తయారీ, టెక్నాలజీ, మొబిలిటీ సొల్యూషన్స్‌ కేంద్రంగా ఎదుగుతోందని కుమారస్వామి అన్నారు.

ఈవీ రంగానికి ప్రభుత్వ ప్రాధాన్యం  
పీఎం డ్రైవ్, పీఎల్‌ఐ ఆటో, పీఎల్‌ఐ ఏసీసీ వంటి పథకాల ద్వారా పటిష్టమైన ఈవీ (ఎలక్ట్రిక్‌ వాహన) వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నా రు. అయితే, తయారీ సామర్థ్యం పెరిగినంత మాత్రాన సరిపోదన్నారు. హై–వోల్టేజ్‌ సిస్టమ్స్, బ్యాటరీ టెక్నాలజీ, పవర్‌ ఎల్రక్టానిక్స్, అధునాతన డయాగ్నస్టిక్స్‌పై ప్రత్యేక పరిజ్ఞానం ఉన్న కొత్త తరం టెక్నీíÙయన్లు, ఇంజనీర్లు, నిపుణులు అవసరమని తెలిపారు.

కొత్త టెక్నాలజీలను నిర్వహించడం, ఆధునిక వ్యవస్థలను మెయింటెయిన్‌ చేయడం, వేగంగా మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా పనిచేయడం, ఆవిష్కరణలు–ఉత్పాదకతకు తోడ్పడేలా యువతను సిద్ధం చేయాలని సూచించారు. ఆటోమొబైల్‌ రంగానికి ఉన్న మల్టీప్లయర్‌ ఎఫెక్ట్‌ కారణంగా ఇంజనీరింగ్, ఎల్రక్టానిక్స్, స్టీల్, ఆటో కాంపోనెంట్లు, లాజిస్టిక్స్, సాఫ్ట్‌వేర్, సేవల వంటి అనుబంధ రంగాల్లోనూ పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టించవచ్చని కుమారస్వామి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement