Petrol & Diesel: ఆ రెండు రాష్ట్రాల్లో అత్యధిక వ్యాట్‌ | Hardeep Puri Says Madhya Pradesh Levies Highest Tax On Petrol Rajasthan On Diesel | Sakshi
Sakshi News home page

Petrol & Diesel: ఆ రెండు రాష్ట్రాల్లో అత్యధిక వ్యాట్‌

Jul 27 2021 7:44 AM | Updated on Jul 27 2021 10:15 AM

Hardeep Puri Says Madhya Pradesh Levies Highest Tax On Petrol Rajasthan On Diesel - Sakshi

న్యూఢిల్లీ: దేశంలోనే అత్యధికంగా పెట్రోల్‌పై మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం  వ్యాట్‌ వసూలు చేస్తుండగా, రాజస్తాన్‌ డీజిల్‌పై అత్యధికంగా వ్యాట్‌ విధిస్తోందని చమురు శాఖ మంత్రి హర్దీప్‌ పూరి సోమవారం లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానంగా చెప్పారు. దేశంలో ఈ నెలలోనే పెట్రోల్, డీజిల్‌ ధరలు గరిష్ట స్థాయికి పెరిగాయని తెలిపారు. పెట్రోల్‌ ధరలో 55%, డీజిల్‌ ధరలో 50% మేర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధిస్తున్న పన్నులే ఉంటున్నాయని ఆయన వివరించారు.

కేంద్రం లీటర్‌ పెట్రోల్‌పై రూ.32.90 చొప్పున, లీటర్‌ డీజిల్‌పై రూ.31.80 చొప్పున ఎక్జైజ్‌ డ్యూటీ విధిస్తుండగా, మిగతాది రాష్ట్రాలు వ్యాట్‌ రూపంలో వసూలు చేస్తున్నాయన్నారు. 2020–21 ఆర్థికంలో కేంద్రం ఎక్సైజ్‌డ్యూటీ రూపంలో రూ.1,01,598 కోట్లను పెట్రోల్‌ నుంచి, రూ.2,33,296 కోట్లను డీజిల్‌ నుంచి వసూలు చేసిందన్నారు. పెట్రోల్, డీజిల్‌ మూల ధర, కేంద్ర పన్నులపై రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ విధిస్తున్నాయని తెలిపారు. దేశంమొత్తమ్మీద అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో వ్యాట్‌ అతి తక్కువగా లీటరు పెట్రోల్‌ పై రూ.4.82, డీజిల్‌పై 4.74 ఉందన్నారు. అదేవిధంగా, దేశంలోనే అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో లీటరు పెట్రోల్‌పై వ్యాట్‌ రూ.31.55, రాజస్తాన్‌లో డీజిల్‌పై రూ.21.82గా ఉంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement