జనరల్‌ అట్లాంటిక్‌ చేతికి ఆసుపత్రులు! | General Atlantic to acquire a majority stake in Amar Ujala healyh care chain | Sakshi
Sakshi News home page

జనరల్‌ అట్లాంటిక్‌ చేతికి ఆసుపత్రులు!

Dec 23 2023 6:27 AM | Updated on Dec 23 2023 6:27 AM

General Atlantic to acquire a majority stake in Amar Ujala healyh care chain - Sakshi

ముంబై: గ్లోబల్‌ పీఈ దిగ్గజం జనరల్‌ అట్లాంటిక్‌(జీఏ) దేశీ ఆసుపత్రుల చైన్‌ను కొనుగోలు చేసే బాటలో సాగుతోంది. 19 ఆసుపత్రుల నెట్‌వర్క్‌ కలిగిన ఉజాలా సిగ్నస్‌ హెల్త్‌కేర్‌ సరీ్వసెస్‌లో 70 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. సంస్థ విలువను రూ. 1,600 కోట్లుగా మదింపు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సంస్థలో తొలుత ప్రస్తుత ఇన్వెస్టర్ల నుంచి 51 శాతం వాటాను కొనుగోలు చేయనుంది.

ప్రస్తుత వాటాదారులలో 8 రోడ్స్‌ వెంచర్స్‌ ఇండియా, ఇవాల్వెన్స్‌ ఇండియా ఫండ్, సోమర్‌సెట్‌ ఇండస్‌ హెల్త్‌కేర్‌ ఫండ్‌ ఉన్నాయి. అంతేకాకుండా ప్రమోటర్ల నుంచి సైతం కొద్దిపాటి వాటానుచేజిక్కించుకోనుంది. వెరసి ఉజాలా సిగ్నస్‌ పేరుతో అమర్‌ ఉజాలా నిర్వహిస్తున్న సంస్థలో మొత్తం 70 శాతం వాటాను జీఏ కొనుగోలు చేయనుంది. డీల్‌ ప్రస్తుతం డాక్యుమెంటేషన్‌ స్థితిలో ఉన్నదని, కొద్ది వారాలలో పూర్తికాగలదని తెలుస్తోంది. అయితే అటు జీఏ, ఇటు ఉజాలా సిగ్నస్‌ ప్రతినిధులు ఈ అంశాలపై స్పందించకపోవడం గమనార్హం!    
ఉత్తరాదిన సర్వీసులు
ఉజాలా సిగ్నస్‌ ప్రధానంగా ఉత్తరాదిన ద్వితీయ, తృతీయస్థాయి పట్టణాలలో 19 ఆసుపత్రులను కలిగి ఉంది. హర్యానా, యూపీ, ఉత్తరాఖండ్, జేఅండ్‌కే, ఢిల్లీలలో మొత్తం 1,800 పడకలతో హెల్త్‌కేర్‌ సర్వీసులు విస్తరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 600 కోట్ల టర్నోవర్, రూ. 120 కోట్ల నిర్వహణ లాభం ఆర్జించగలదని అంచనా. సిగ్నస్‌ మెడికేర్‌ను 2011లో డాక్టర్లు దినేష్‌ బాత్రా, షుచిన్‌ బజాజ్‌ ఏర్పాటు చేశారు. తదుపరి 2019లో అమర్‌ ఉజాలా మెజారిటీ వాటాను సొంతం చేసుకుంది.

హెల్త్‌కేర్‌ రంగంలో విస్తరించే ప్రణాళికలతో 10 సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్వహిస్తున్న సంస్థలో రూ. 130 కోట్లకు నియంత్రణ వాటాను కొనుగోలు చేసింది. ఆపై ఉజాలా హెల్త్‌కేర్‌కుగల రెండు ఆసుపత్రులను సిగ్నస్‌లో విలీనం చేసింది. తద్వారా విలీన సంస్థలో నియంత్రణతోపాటు ప్రధాన వాటాను పొందింది. కాగా.. 2018లో కృష్ణా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(కిమ్స్‌ హాస్పిటల్స్‌)లోనూ జీఏ 13 కోట్ల డాలర్లు(సుమారు రూ. 1,079 కోట్లు) ఇన్వెస్ట్‌ చేసి మైనారిటీ వాటాను కొనుగోలు చేసిన విషయం విదితమే.

Advertisement
 
Advertisement
Advertisement