ఆరోగ్యశ్రీ ఆగి..మంచం మీద రోగి | Medical services have been completely paralyzed for a week | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశ్రీ ఆగి..మంచం మీద రోగి

Oct 15 2025 5:45 AM | Updated on Oct 15 2025 5:45 AM

Medical services have been completely paralyzed for a week

నెల రోజులుగా చోద్యం చూస్తున్న చంద్రబాబు సర్కార్‌

ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు సమ్మెబాట పట్టి నెల రోజులు పూర్తి.. వారం రోజులుగా పూర్తిగా స్తంభించిన వైద్యసేవలు 

ఉచిత చికిత్సలను నిరాకరిస్తున్న ఆస్పత్రుల యాజమాన్యాలు  

రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నా పట్టించుకోని చంద్రబాబు సర్కార్‌..  పెండింగ్‌ బకాయిలు చెల్లించే వరకూ సమ్మె విరమించబోమని యాజమాన్యాల స్పష్టీకరణ 

కూటమి పాలనలో రూ.3వేల కోట్లకు పైగా బకాయిలు 

వైద్యుల సమ్మెతో పీహెచ్‌సీల్లోనూ అందని వైద్యం

రాజమండ్రికి చెందిన రమేశ్‌కు మంగళవారం ప్రమాదవ­శాత్తూ కాలు విరగడంతో అదే నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లాడు. తాను ఆరోగ్యశ్రీ లబ్ధిదారుడినని ఉచితంగా చికిత్స చేయాలని కోరాడు. ప్రభుత్వం బిల్లులు ఇవ్వడంలేదని, ఉచిత చికిత్సలు నిలిపేశామని సిబ్బంది చెప్పారు. డబ్బులు కడితేనే వైద్యం చేస్తామన్నారు. శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని రూ.లక్ష వరకూ అవుతుందని చెప్పడంతో రమేశ్‌ కుటుంబ సభ్యుల గుండెల్లో పిడుగు పడినట్లయింది. అంత డబ్బు తమ వద్ద లేదని, రూ.5వేలు ఉన్నాయని చెప్పారు. 

అయితే ప్రస్తుతానికి తాత్కాలికంగా కట్టుకట్టి, మందులు ఇస్తాం. ఆరోగ్యశ్రీ సేవలు పునఃప్రారంభించాక కబురుపెడతాం. అప్పుడు వస్తే శస్త్ర చికిత్స చేస్తామని వైద్యులు సూచించారు. చేసేదేమీ లేక వైద్యులు చెప్పినట్టుగానే తాత్కాలికంగా కట్టు కట్టించుకుని రమేశ్‌ను కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. ఇదే ఆస్పత్రికి సోమవారం ఒక వ్యక్తి కాలి మడమ విరిగిందని వచ్చాడు. ఆరోగ్యశ్రీ కింద ఉచిత సేవలు నిలిపేశామని చెప్పడంతో చేసేదేమీ లేక రూ.40వేలు కట్టి చికిత్స చేయించుకున్నాడు.  

ఎన్టీఆర్‌ జిల్లా ఎ.కొండూరు మండలానికి చెందిన కిడ్నీ వ్యాధి బాధితుడు శ్రీనివాస్‌ ఇటీవల వరకు విజయవాడలోని ఓ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రిలో డయాలసిస్‌ చేయించుకున్నాడు. యథావిధిగా సోమవారం డయాలసిస్‌ చేయించుకోవడానికి ఆస్పత్రికి వచ్చాడు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేశామని, డయాలసిస్‌ సేవలు కూడా ఆపేశామని ఆస్పత్రి సిబ్బంది చెప్పారు. ఆరోగ్యశ్రీ సేవలు మళ్లీ ప్రారంభించే వరకూ డబ్బు చెల్లిస్తేనే డయాలసిస్‌ చేస్తామన్నారు. దీంతో డయాలసిస్‌ ఆపేస్తే దీర్ఘకాలిక జబ్బుతో బాధపడుతున్న తమ పరిస్థితి ఏమైపోవాలని శ్రీనివాస్‌తోపాటు మరికొందరు రోగులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు.   

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పేద, మధ్య తరగతి రోగులు వైద్యసేవల కోసం తీవ్ర అగచాట్లు పడుతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు సమ్మెబాట పట్టి నెల రోజు­లు గడిచిపోయింది. పూర్తి స్థాయిలో వైద్య సేవలు నిలిపివేసి వారం రోజులైంది. ఎక్కడా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పేద రోగులు ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. దీంతో జనాలు ఏమైపోతే మనకేంటి... అన్నట్టుగానే సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఒక్కో ఆస్పత్రికి రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్లు 
చంద్రబాబు గద్దెనెక్కిన నాటి నుంచి రాష్ట్రంలో 1.42 కోట్లకు పైగా కుటుంబాలకు సంజీవని అయిన ఆరోగ్యశ్రీపై నీలినీడలు కమ్ముకున్నాయి. బీమా ప్రవేశపెడతామని ప్రకటించి ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వర్యం చేశారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు బిల్లుల చెల్లింపులను నిలిపేశారు. దీంతో ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్‌ కలిపి రూ.3వేల కోట్లకు పైగా ఆస్పత్రులకు ప్రభు­త్వం బకాయిపడింది. సాధారణంగా చికిత్సలు అందించిన 40 రోజుల్లో ఆస్పత్రులకు అందాల్సిన బిల్లులు ఏడాది గడిచినా కనీసం ప్రాసెస్‌కు కూడా నోచుకోని దుస్థితి ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌­లో నెలకొంది. 

ఆస్పత్రుల నుంచి వచి్చన 10 లక్షలకు పైగా క్లెయిమ్‌లను ట్రస్ట్‌ స్థాయిలోనే ప్రభుత్వం తొక్కి పెట్టింది. వీటి విలువ రూ.2వేల కోట్లకు పైనే ఉంటుందని తెస్తోంది. మరో రూ.650 కోట్ల మేర సీఎఫ్‌ఎంఎస్‌లో బిల్లులు పెండింగ్‌లో ఉంటున్నాయి. చంద్రబాబు గద్దెనెక్కిన నాటి నుంచి ఈహెచ్‌ఎస్‌ బిల్లుల చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయిందని నెట్‌వర్క్‌ ఆస్పత్రులు చెబుతున్నాయి. వీటి విలువ రూ.300 కోట్ల పైమాటే. ఇలా అన్ని రకాల బిల్లులు రూ.3వేల కోట్లకు పైనే చెల్లింపులు ఆగిపోయాయి. 

ఈ నేపథ్యంలో సామర్థ్యాన్ని బట్టి ఒక్కో ఆస్పత్రికి రూ.2కోట్ల నుంచి రూ.5కోట్ల వరకు బిల్లులు రావాల్సిన పరిస్థితి. పెద్ద మొత్తంలో బిల్లులు నిలిచిపోవడంతో ఆస్పత్రుల నిర్వహణ కూడా కష్టంగా మారిందని యజమానులు చేతులెత్తేసి సమ్మెలోకి వెళ్లారు. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఒకసారి ఆస్పత్రులు సమ్మెలోకి వెళ్లాయి. అప్పట్లో సీఎంతో చర్చల అనంతరం సమ్మె విరమించారు. ఆ తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో గత నెల 15 నుంచి మరోమారు ఆస్పత్రులు సమ్మెబాట పట్టాయి. ఉచిత ఓపీ, డయగ్నోస్టిక్స్‌ సేవలు నిలిపేశారు. అయినా ప్రభుత్వం దిగిరాకపోవడంతో ఈ నెల 10వ తేదీ నుంచి పూర్తి స్థాయి సేవలు ఆపేశారు.  

రాష్ట్రంలో హెల్త్‌ ఎమర్జెన్సీ పరిస్థితులు 
ప్రస్తుతం రాష్ట్రంలో హెల్త్‌ ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు నెలకొన్నాయి. గుంటూరు రూరల్‌ మండలం తురకపాలెంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అరుదైన మెలియాయిడోసిస్‌ వ్యాధి బారినపడి ఇటీవల ఏకంగా 45 మందికిపైగా మృత్యువాత పడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యారి్థనులు పెద్ద ఎత్తున పచ్చకామెర్ల బారినపడి అల్లాడుతున్నారు. వారిలో ఇద్దరు మరణించారు. మరోవైపు వాతావరణ మార్పుల వల్ల వైరల్‌ జ్వరాలు, జలుబు, దగ్గు, ఇతర సీజనల్‌ వ్యాధులు కూడా ప్రబలుతున్నాయి. 

ఈ పరిస్థితుల్లో తమ డిమాండ్ల సాధన కోసం పీహెచ్‌సీ వైద్యులు సమ్మె చేస్తున్నారు. పది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైద్యులందరూ విజయవాడకు వచ్చి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. దీంతో గ్రామీణ, గిరిజన మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలు పూర్తిగా స్తంభించాయి. అనారోగ్యం బారినపడిన ప్రజలకు ప్రభుత్వాస్పత్రుల్లో నాడిపట్టే వారు లేక ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళితే... అక్కడా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేశారు.దీంతో రోగాలు ప్రబలుతున్నాయి.వైద్యమూ అందడం లేదు. 

రాష్ట్రంలో హెల్త్‌ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో నెలకొన్నా ప్రభుత్వ పెద్దలు మాత్రం పట్టించుకోవడం లేదు. పెళ్లిళ్లు, పుస్తక ఆవిష్కరణలు, ఇతర ప్రైవేట్‌ కార్యక్రమాలు, వీకెండ్‌లో హైదరాబాద్‌ పర్యటనలకు సమయం కేటాయిస్తున్న ప్రభుత్వ పెద్దలు... ప్రజారోగ్యంపై సమీక్ష చేసేందుకు సమయం కేటాయించకపోవడం గమనార్హం.  

సమ్మె మరింత ఉధృతం
ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ మంగళవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. తమకు ప్రైవేట్‌ మెడికల్, డెంటల్‌ కళాశాలల మద్దతు కూడా ఉందని వెల్లడించింది. ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు సమ్మె చేయడం వల్ల ఆరోగ్యశ్రీ సేవలపై తీవ్ర ప్రభావం పడిందని పేర్కొంది.

శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన తిరుపాల్‌­నాయక్‌ అనే కూలికి ఈ నెల 13న రాత్రి పురుగు కుట్టడంతో నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో చూపించుకునేందుకు ప్రయత్నించగా.. అక్కడి వైద్యులు ఎన్టీఆర్‌ వైద్య సేవ కింద కేసు చూడటం లేదన్నారు. దీంతో అతను రాత్రి ఇంటికి వెళ్లిపోయాడు. ఉదయం కంతా తొడభాగం దెబ్బతినగా.. స్థానిక వైద్యుల సూచన మేరకు 14వ తేదీ (మంగళవారం) అనంతపురంలోని సాయి­నగర్‌లో ఉన్న ఓ ప్రముఖ ఆస్పత్రికి వచ్చాడు. ఇక్కడికి వచ్చాక ఎన్టీఆర్‌ వైద్య సేవలు­(ఆరోగ్యశ్రీ) బంద్‌ అయినట్లు చెప్పడంతో ప్రభుత్వ సర్వజనా­స్పత్రికి వెళ్లాడు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో సేవలు లేకపోతే ఎలాగంటూ తిరుపాల్‌ నాయక్‌ భార్య లక్ష్మీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి కేసులు రోజూ పదుల సంఖ్యలో ప్రభుత్వ ఆస్పత్రికి వస్తున్నాయి.

ఆరోగ్యశ్రీ లేక అవస్థలు
నేను నరాల సంబంధిత సమస్యతో బాధపడుతు­న్నా­ను. సర్జరీ చేస్తానని సుమా­రు 15 రోజుల క్రితం తేదీ ఖరారు చేశారు. ఈ నేప­థ్యం­లో మంగళవారం ఆస్పత్రికి వచ్చాను. ఆరోగ్యశ్రీ నిలిపేశారని చెప్పి సర్జరీ చేయలే­మని చెప్పారు. నాకు సకాలంలో సర్జరీ చేయ­కపోతే మెదడుపై ప్రతికూల ప్రభావం ఉంటుందని వైద్యులే చెబుతు­న్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకునే స్తోమత మాకు లేదు. ప్రభుత్వం నుంచి బకాయిలు రాకపోవడం వల్ల సేవలకు అంతరాయ ఏర్పడడం దారుణం. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి.– చలమల సాయి శ్రీధర్, కాకినాడ

వెన్నెముక సమస్యతో వచ్చాం..
నాకు కొన్ని నెలలుగా వెన్నె­ముక సమస్య ఉంది. దాంతోపాటు విపరీతమైన కీళ్ల నొప్పు­లున్నాయి. ఆరోగ్య­శ్రీ ఉందని ప్రైవేటు ఆస్ప­త్రికి వచ్చాం. ఇక్కడకు వచ్చాక ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యసేవలు నిలిపేశామని చెప్పారు. రూ.200 ఇచ్చి ఓపీ తీసుకున్నాం. డాక్టర్‌ దగ్గరికి వెళితే కొన్ని రకాల రక్త పరీక్షలు రాశారు.వాటికి రూ.5వేల దాకా ఖర్చు అయింది. 

ఆరోగ్యశ్రీని నమ్ముకుని వచ్చాం. అప్పు చేసి ఆరోగ్యానికి వెచ్చించాల్సి వచ్చింది. ఇలాగైతే పేదలకు ఇబ్బందే. ప్రభుత్వం వెంటనే ఆస్పత్రులకు బకాయిలు చెల్లించడంతోపాటు పేదలకు ఇబ్బంది లేకుండా ఆరోగ్యశ్రీ సేవలు అందేలా చూడాలి. – రామకృష్ణ, చెర్లోపల్లి, తవణంపల్లి మండలం, చిత్తూరు జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement