దేశ ఆర్థిక దిశను నిర్దేశించే 2026-27 వార్షిక బడ్జెట్ సమర్పణకు సమయం దగ్గరపడింది. ‘డిజిటల్ బహీ-ఖాతా’తో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కర్తవ్య భవన్ నుంచి బయలుదేరారు. పార్లమెంట్లో బడ్జెట్ చదవడానికి ముందు ఆమె నేరుగా రాష్ట్రపతి భవన్కు చేరుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుస్తారు. రాజ్యాంగబద్ధంగా వస్తున్న ఈ ఆనవాయితీకి కారణాలేమిటి? సూట్కేస్ స్థానంలో వచ్చిన ‘డిజిటల్ బహీ-ఖాతా’ కథేంటి? వంటి వివరాలు మీకోసం..
రాష్ట్రపతిని ఎందుకు కలుస్తారు?
బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఆర్థిక మంత్రి రాష్ట్రపతిని కలవడం కేవలం ఒక మర్యాదపూర్వక భేటీ మాత్రమే కాదు. దీని వెనుక రాజ్యాంగ, సాంప్రదాయ కారణాలు ఉన్నాయి.
రాజ్యాంగ నిబంధన (ఆర్టికల్ 112): భారత రాజ్యాంగం ప్రకారం, బడ్జెట్ను (వార్షిక ఆర్థిక నివేదిక) పార్లమెంట్లో ప్రవేశపెట్టే బాధ్యత నిజానికి రాష్ట్రపతిదే. రాష్ట్రపతి తరపున ఆర్థిక మంత్రి ఈ బాధ్యతను నిర్వహిస్తారు. అందుకే బడ్జెట్ ప్రసంగం చదవడానికి ముందు రాష్ట్రపతి నుంచి అధికారికంగా అనుమతి తీసుకోవడం తప్పనిసరి.
బడ్జెట్ అనేది ఒక ‘మనీ బిల్లు’. రాజ్యాంగం ప్రకారం ఏదైనా మనీ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి ముందస్తు సిఫార్సు అవసరం.
సంప్రదాయం ప్రకారం రాష్ట్రపతిని కలిసినప్పుడు ఆర్థిక మంత్రికి రాష్ట్రపతి ‘పెరుగు-చక్కెర’ తినిపిస్తారు. ఒక ముఖ్యమైన పనికి వెళ్లే ముందు ఇది దేశీయంగా ఒక శుభసూచకంగా భావిస్తారు.
రాష్ట్రపతిని కలిసిన తర్వాత ఆర్థిక మంత్రి పార్లమెంట్కు చేరుకుని ప్రధాని నేతృత్వంలోని కేంద్ర మంత్రిమండలి (Cabinet) సమావేశంలో బడ్జెట్కు తుది ఆమోదం పొందుతారు.
#WATCH | President Droupadi Murmu feeds Union Finance Minister Nirmala Sitharaman the customary 'dahi-cheeni' (curd and sugar) ahead of her ninth consecutive Union Budget presentation. pic.twitter.com/WouiznFEMr
— ANI (@ANI) February 1, 2026
ఏంటి ఈ ‘డిజిటల్ బహీ-ఖాతా’?
బ్రిటిష్ హయాం నుంచి వస్తున్న ‘లెదర్ బ్రీఫ్కేస్’ సంప్రదాయానికి స్వస్తి పలుకుతూ 2019లో నిర్మలా సీతారామన్ ‘బహీ-ఖాతా’ విధానాన్ని తీసుకొచ్చారు. ఇది ఎర్రటి వెల్వెట్ క్లాత్తో చేసిన బ్యాగ్. దీనిపై బంగారు రంగులో మన జాతీయ చిహ్నం (అశోక చక్రం) ముద్రించి ఉంటుంది. 2021 నుంచి కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా బడ్జెట్ను పేపర్లెస్గా మార్చారు. ఇప్పుడు ఆ ఎర్రటి బహీ-ఖాతా లోపల కాగితపు పత్రాలకు బదులుగా ఒక డిజిటల్ టాబ్లెట్ ఉంటుంది.
ఇదీ చదవండి: Budget 2026: కేంద్ర బడ్జెట్కు వేళాయె..


