ఆన్‌లైన్‌ ఉన్నా చివరకు షోరూంలోనే.. | even online services is there customers reach car showrooms to purchase | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ ఉన్నా చివరకు షోరూంలోనే..

Dec 24 2024 9:13 AM | Updated on Dec 24 2024 9:13 AM

even online services is there customers reach car showrooms to purchase

మార్కెట్లో ఎలాంటి కార్లు ఉన్నాయి.. బడ్జెట్‌ వివరాలతోపాటు మనకు కావాల్సిన ఫీచర్లు ఏ మోడళ్లలో ఉన్నాయి. ఒక ధరల శ్రేణిలో లభిస్తున్న మోడళ్ల మధ్య ఉన్న వ్యత్యాసాలు ఏమిటి.. ఇలాంటి అంశాలన్నీ ఆన్‌లైన్‌లో తెలుసుకుంటున్నప్పటికీ అత్యధికులు షోరూంకు వెళ్లే కారు స్టీరింగ్‌ పడుతున్నారట. ప్రత్యక్షంగా ఔట్‌లెట్‌కు వెళ్లి పరిశీలించిన తర్వాతే వాహనాన్ని కొనుగోలు చేస్తున్నారని అర్బన్‌ సైన్స్‌ సర్వేలో తేలింది. భారత్‌తోపాటు యూఎస్, జర్మనీ, యూకే, చైనా, మెక్సికో నుంచి 9,000 పైచిలుకు మంది ఈ సర్వేలో పాలుపంచుకున్నారు. భారత్‌లో 10 మంది కార్ల కొనుగోలుదార్లలో దాదాపు 9 మంది షోరూంను సందర్శించడానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారట. సర్వేలోని వివరాలు కింది విధంగా ఉన్నాయి.

నమ్మదగిన విధానం..

ఇలా ఔట్‌లెట్‌కు వెళ్లడాన్ని ఒక ప్రధాన ఆర్థిక నిర్ణయం తీసుకోవడానికి నమ్మదగిన విధానంగా కస్టమర్లు భావిస్తున్నారు. కారును కొనుగోలు చేయడంలో కుటుంబ పాత్ర ఉంటుంది. షోరూంలతో వ్యక్తిగత సంబంధాలు ఉంటాయి. నేరుగా వెళ్లడం వల్ల కార్లను ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇటువంటి అనుభవాన్ని డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లు ఇవ్వలేవు. డీలర్‌షిప్‌లు నమ్మకాన్ని పెంపొందిస్తాయి, వ్యక్తిగతీకరించిన డీల్స్‌ ఉంటాయి. సంబంధాలు పెంపొందించబడతాయి. అమ్మకాల తర్వాత మద్దతు కూడా ఉంటుందన్నది కస్టమర్ల భావన. ఇందుకు అనుగుణంగా కస్టమర్లలో విశ్వాసాన్ని పెంపొందించేందుకు తయారీ సంస్థలు నెట్‌వర్క్‌లను విస్తరిస్తున్నాయి.  

ఇదీ చదవండి: వాయిస్‌ కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం ప్రత్యేక ప్లాన్‌

ఆన్‌లైన్‌లో బ్రౌజింగ్‌..

సంప్రదాయ డీలర్‌షిప్‌లు ప్రస్తుతం భారతదేశ ఆటోమోటివ్‌ వ్యవస్థలో ఆధిపత్యం చెలాయిస్తుండగా.. డిజిటల్‌ వేవ్‌ క్రమంగా ఊపందుకుంటోంది. యువకులు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వినియోగదారులు షోరూమ్‌లోకి అడుగుపెట్టే ముందు ఆన్‌లైన్‌లో బ్రౌజ్‌ చేస్తున్నారు. డీలర్‌షిప్‌లు, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లు రెండూ భవిష్యత్తులో కొనసాగుతాయి. సంప్రదాయ డీలర్‌షిప్‌లు ప్రత్యేకంగా అందించే నమ్మకాన్ని, వ్యక్తిగత సంబంధాలను కాపాడుకుంటూ.. అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల అంచనాలను అందుకోవడానికి సరైన సమతూకం సాధించడం చాలా అవసరం’ అని సర్వేలో వెల్లడైంది.
 

Advertisement
 
Advertisement
Advertisement