
ఏ రంగంలోనైనా పోటీ ఉండాలి
టెలికం శాఖ మంత్రి సింధియా వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఏ రంగంలోనైనా రెండే సంస్థల గుత్తాధిపత్యం ఉంటే మంచిది కాదని టెలికం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వ్యాఖ్యానించారు. తప్పనిసరిగా మరింత పోటీ ఉండాలని బ్రాడ్బ్యాండ్ ఇండియా ఫోరం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. దేశీ టెలికం రంగంలో భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియో ఆధిపత్యం నడుస్తుండటం, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వొడాఫోన్ మనుగడ ప్రశ్నార్థకంగా మారడం, బీఎస్ఎన్ఎల్ ఇప్పటికీ దేశవ్యాప్తంగా 4జీ, 5జీ సేవలను ప్రవేశపెట్టడంపై కసరత్తే చేస్తుండటం తదితర అంశాల నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
దేశీయంగా ఇంటర్నెట్ సరీ్వస్ ప్రొవైడర్ల మధ్య తీవ్రమైన పోటీ ఉందని ఆయన చెప్పారు. వైఫై సరీ్వసులకు ఉపయోగపడే 6 గిగాహెట్జ్ స్పెక్ట్రం డీలైసెన్సింగ్కి సంబంధించి ఆగస్టు 15లోగా ప్రభుత్వం నిబంధనలను ప్రకటించే అవకాశం ఉందని సింధియా చెప్పారు. శాటిలైట్ కమ్యూనికేషన్స్ సరీ్వసులకు త్వరలోనే స్పెక్ట్రం కేటాయించనున్నట్లు వివరించారు. ప్రతి ఒక్కరికి టెక్నాలజీ ఫలాలు అందేలా అవకాశాలను కల్పించడమే ప్రభుత్వ బాధ్యతని సింధియా చెప్పారు. సాధారణంగా పరిమాణం పెరిగే కొద్దీ ధర తగ్గుతుందని, ఒకప్పుడు దేశీయంగా ఫోన్ కాల్ చేస్తే నిమిషానికి రూ. 16 చార్జీ ఉండేదని, పదేళ్ల క్రితం అది అర్థ రూపాయికి తగ్గిందని, ఇప్పుడు 0.03 పైసలకు దిగి వచి్చందని ఆయన తెలిపారు. మరోవైపు ప్రజలు మరింతగా బ్రాడ్బ్యాండ్ వినియోగించుకునేందుకు వీలుండేలా డివైజ్లను చౌకగా తయారు చేయడంపై దృష్టి పెట్టాలని డివైజ్, చిప్ల తయారీ కంపెనీలను మంత్రి కోరారు.