'బుల్లిబాయ్‌' యాప్‌ మాస్టర్‌ మైండ్‌?! ఈ శ్వేత ఎవరు!

details about Bulli Bai mastermind Shweta Singh - Sakshi

సోషల్‌ మీడియా..దూరంగా ఉన్న వారిని దగ్గరకు చేరుస్తూ సరికొత్త బాటలు వేస్తోంది. అయితే ఈ సోషల్‌ మీడియాను ద్వేషపూరిత వ్యక్తుల చేతిలో పడితే ప్రమాదాలను మోసుకొస్తోంది. అందుకు తాజా ఉదాహరణే ఈ 'బుల్లిబాయ్‌' ఘటన. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న బుల్లిబాయ్‌ ఉదంతంలో కీలక వ్యక్తి ఓ టీనేజర్‌. ఎంతోమందికి మేలు చేస్తున్న సోషల్‌ మీడియాని ఆమె ఎలా దుర్వినియోగం చేసిందనే వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.  
 

దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన ‘బుల్లీ బాయ్‌’ కేసు వ్యవహారంలో తీగలాగితే డొంక కదులుతోంది. ఈ కేసులో అసలు సూత్రధారి 18 ఏళ్ల శ్వేతాసింగ్‌ను మంగళవారం ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆమెకు సహకరించిన మరో నిందితుడు 21ఏళ్ల ఇంజినీరింగ్‌ విద్యార్ధిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు..ఈ యాప్‌ వ్యవహారంలో ఇంకెవరి హస్తం ఉందన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో శ్వేతా సింగ్‌ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.     

వయస్సు 18 ఏళ్లే  
సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఓ వర్గానికి చెందిన యువతుల్ని టార్గెట్‌ చేసిన 18ఏళ్ల శ్వేతా ఆమె సహచరులు..వారి ఫోటోల్ని మార్ఫింగ్‌ చేసి ఆన్‌లైన్‌ వేదికగా బుల్లిబాయ్‌ అనే యాప్‌లో వేలం వేశారు. ఆరునెలల క్రితం గిట్‌హాబ్‌ అనే సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌లో 'సు**డీల్స్‌' పేరుతో అకౌంట్‌ నిర్వహించిన వారే దాన్ని బుల్లీ బాయ్‌ మార్చినట్లు ముంబై పోలీసులు గుర్తించారు. అయితే బుల్లియాప్‌ వేలంలో వ్యక్తిగత ఫోటోలు వెలుగులోకి రావడంతో దేశ వ్యాప్తంగా ఉన్న పలువురు బాధితులు పోలీసుల‍్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పలువురు నిందితుల్ని అరెస్ట్‌ చేశారు.ఈ యాప్‌ మాస్టర్‌ మైండ్‌ శ్వేతా సింగ్‌ పూర్వాపరాల్ని పరిశీలిస్తుండగా..వీటన్నింటికి కారణం ఆమె కుటుంబ పరిస్థితులేనని పోలీసులు అనుమానిస్తున్నారు.మరోవైపు అసలు నిందితురాలు శ్వేతేనా? లేదంటే ఆమెతో ఇంకెవరైనా ఇలా చేయిస్తున్నారా? అనే విషయాల్ని తెలుసుకుంటున్నారు. 
 
కుటుంబ సభ్యుల్ని కోల్పోయింది
బుల్లీ యాప్‌ మాస్టర్‌ మైండ్‌ శ్వేతా సింగ్‌ తన తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయింది. 2020-21 మధ్య కాలంలో క్యాన్సర్‌తో తల్లిని, గతేడాది కోవిడ్‌ కారణంగా తండ్రిని కోల్పోయింది. ఇక ఆమెకు డిగ్రీ చదివిన అక్క, స్కూల్‌కు వెళ్లే తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. శ్వేతా ఇంజినీరింగ్ ఎంట్రన్స్‌ ఎగ్జామ్స్‌కోసం ప్రిపేర్‌ అవున్నట్లు పోలీసులు గుర్తించగా..కుటుంబ పోషణ కోసమే నిందితురాలు ఇలా చేస్తుందనే ఆధారాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

ట్విట్టర్‌ ఫేక్‌ అకౌంట్‌ 
ఇక ఆమె JattKhalsa07 పేరుతో నకిలీ ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాండిల్‌ చేస్తుందని.. ద్వేషపూరిత పోస్ట్‌లు, అభ్యంతరకరమైన ఫోటోలు, కామెంట్స్‌ చేసేందుకు ఉపయోగించేదని ముంబై పోలీసుల చెబుతున్నారు. ఆమె సహచరులు సైతం ఇదే తరహాలో సోషల్‌ మీడియా అకౌంట్లను నిర్వహించేవారు. ఇక శ్వేతా నేపాల్‌లో ఉన్న తన స్నేహితురాలి సూచనల మేరకు పనిచేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈకేసుకు సంబంధం ఉన్న నిందితుల నుంచి సేకరించిన ప్రాథమిక సమాచారం ప్రకారం..నేపాల్‌కు చెందిన జియో' అనే వ్యక్తి ఈ యాప్‌లో నిర్వహించాల్సిన కార్యకలాపాలకు సంబంధించి ఆమెకు సూచనలు ఇచ్చినట్లు దర్యాప్తు బృందం వర్గాలు తెలిపాయి. అతనితో పాటు ఆమెతో సంబంధం ఉన్న మరికొందరి పాత్రపై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. 

చదవండి: బుల్లీ బాయ్‌’ కేసు దర్యాప్తు ముమ్మరం

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top