
దేశరాజధాని ఢిల్లీలోని కిలోక్రీలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్ఎస్)ను ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఇండిగ్రిడ్, బీఎస్ఈఎస్ సహకారంతో అభివృద్ధి చేసిన ఈ స్టాండలోన్ యుటిలిటీ స్కేల్ సిస్టమ్ పవర్ గ్రిడ్ను స్థిరీకరించేందుకు తోడ్పడుతుందని పేర్కొన్నారు. దీనివల్ల దక్షిణ ఢిల్లీలోని దాదాపు లక్ష మంది నివాసితులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.
బీఈఎస్ఎస్ ఎలా పనిచేస్తుంది?
బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్ఎస్)ను 20 మెగావాట్లు/40 మెగావాట్హవర్ స్టోరేజీ సామర్థ్యం కలిగిన అత్యాధునిక వ్యవస్థ కోసం రూపొందించారు. ఇది భారీ ఇన్వర్టర్ మాదిరిగా పని చేస్తుంది. విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు ఆఫ్-పీక్ అవర్స్లో ఛార్జ్ అవుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు తిరిగి గ్రిడ్కు విద్యుత్ సరఫరా అందిస్తుంది. దీనివల్ల విద్యుత్ వినియోగంలో హెచ్చుతగ్గులు లేకుండా ఉండేందుకు వీలవుతుంది. ఇది విద్యుత్ సరఫరా మౌలిక సదుపాయాలపై ప్రభావం, తద్వారా అంతరాయాలను తగ్గిస్తుంది.
ప్రయోజనాలు
బీఈఎస్ఎస్ విధానం స్థిరమైన విద్యుత్ సరఫరాను నిర్వహించడానికి సహాయపడుతుంది. సప్లైలో హెచ్చుతగ్గులను నిర్వహిస్తుంది. పీక్ అవర్స్లో సంప్రదాయ విద్యుత్ ఉత్పత్తిపై ఆధారపడటాన్ని నియంత్రిస్తుంది. పునరుత్పాదక సౌర, పవన విద్యుత్ నిర్వహణకు వీలు కల్పించడం ద్వారా ఈ వ్యవస్థ క్లీన్ ఎనర్జీ పరిష్కారాలకు మద్దతు ఇస్తుంది. వేలాది మంది నివాసితులకు నిరంతర విద్యుత్ను అందిస్తుంది. విద్యుత్ సరఫరాలో బ్లాక్అవుట్లను నివారిస్తుంది.
ఇదీ చదవండి: రైతన్నపై ప్రకృతి ప్రకోపం
దక్షిణాసియాలో అతిపెద్ద బ్యాటరీ స్టోరేజ్
పంపిణీ స్థాయిలో దక్షిణాసియాలోనే అతిపెద్ద బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థ ఇదేనని అధికారులు తెలిపారు. వాతావరణ మార్పులకు సంబంధించి పెరుగుతున్న ఆందోళనలు, స్థిరమైన విద్యుత్ పరిష్కారాలు అవసరం అవుతుండడంతో బీఈఎస్ఎస్ వంటి బ్యాటరీ స్టోరేజ్ విధానాలు ఆధునిక నగరాలకు కీలకమైన సాధనాలుగా మారుతున్నాయని చెప్పారు.