ఈపీఎఫ్ఓ, పీఎంఓ డేటా లీకేజీ క‌ల‌క‌లం?.. అప్రమత్తమైన కేంద్రం | Data Breach From Epfo And Pmo Office | Sakshi
Sakshi News home page

ఈపీఎఫ్ఓ, పీఎంఓ డేటా లీకేజీ క‌ల‌క‌లం?.. అప్రమత్తమైన కేంద్రం

Feb 21 2024 12:03 PM | Updated on Feb 21 2024 12:57 PM

Data Breach From Epfo And Pmo Office - Sakshi

దేశంలో డేటా లీకేజీ కలకలం రేపుతోంది. ప్రధాని కార్యాలయం (పీఎంఓ), ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ)ల డేటాబేస్ నుంచి డేటా లీకైనట్లు తెలుస్తోంది. ఈ డేటా లీకేజీపై స్పష్టత ఇవ్వాలని కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ ఆఫ్‌ ఇండియా (CERT-In) కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.  

డేటా లీకేజీపై సమాచారం ఉంది. కానీ వాస్తవమా? కాదా? అని తెలుసుకునేందుకు రివ్యూ జరుపుతున్నాం. సీఈఆర్టీ.ఇన్ ఇచ్చే రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.  

డేటా లీకేజీ అంటూ వస్తున్న నివేదికలను పరిశీలిస్తున్నట్లు కేంద్రానికి చెందిన సైబర్ సెక్యూరిటీ నిపుణులు తెలిపారు. ‘డేటా లీకేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. అయితే, సైబర్ నేరస్తులు ఒక సర్వర్ ను యాక్సిస్ చేసినట్లు కొన్ని వాదనలు వినిపిస్తున్నాయని, అందుకు తగ్గ ఆధారాలు లేవు’ అని స్పష్టం చేశారు.

గ్లోబల్ సాఫ్ట్‌వేర్, కోడ్ రిపోజిటరీ గిత్ హబ్‌లో చైనీస్ సైబర్ ఏజెన్సీలకు చెందిన కొన్ని పత్రాలు లీక్ అయ్యాయని, ఈ డాక్యుమెంట్‌లలో ఈపీఎఫ్‌ఓ, ఇండియన్ పీఎంఓ, ఇతర పబ్లిక్ నుండి డేటా ఉందని సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ఎక్స్ లో పలు పోస్ట్ లు వెలుగులోకి వచ్చాయి. అయితే, ఈ డేటా లీకేజీ అంశంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. 

భారత్ లక్ష్యంగా
గత ఏడాది నవంబర్ లో విడుదల చేసిన నివేదిక ప్రకారం..ఇటీవల కాలంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, తాజ్ హోటల్స్, ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్ వంటి సంస్థలపై సైబర్ దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయి. దీంతో పాటు ఐటీ, బిజినెస్ ఔట్ సోర్సింగ్ సంస్థలతో సహా పలు సర్వీసులు అందించే సంస్థలపై అత్యధికంగా సైబర్ దాడులు జరిగినట్లు నివేదికలు హైలెట్ చేశాయి. సింగపూర్ కు చెందిన సైబర్ ఫిర్మా 2023 నివేదిక సైతం ప్రపంచ వ్యాప్తంగా జరిగే సైబర్ దాడులు భారత్ ను లక్ష్యంగా చేసుకుని 13.7శాతం ఉందని, ఆ తర్వాత అమెరికా, ఇండో నేషియా,చైనా దేశాలు ఉన్నట్లు తేలింది. 

Advertisement
 
Advertisement
Advertisement