వాణిజ్యంపై యుద్ధ ప్రభావం ఎంత? | Commerce Ministry to assess Iran-Israel conflict impact on trade | Sakshi
Sakshi News home page

వాణిజ్యంపై యుద్ధ ప్రభావం ఎంత?

Jun 22 2025 6:02 AM | Updated on Jun 22 2025 6:02 AM

Commerce Ministry to assess Iran-Israel conflict impact on trade

పరిస్థితులను సమీక్షించిన వాణిజ్య శాఖ 

భాగస్వాముల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం 

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌–ఇరాన్‌ మధ్య ఘర్షణలు మరింత తీవ్రమైతే మనదేశ వాణిజ్యంపై ఏ మేరకు ప్రభావం పడుతుందన్న దానిపై కేంద్ర వాణిజ్య శాఖ కీలక సమావేశం నిర్వహించింది. షిప్పింగ్‌ సంస్థలు, ఎగుమతిదారులు, కంటెయినర్‌ కంపెనీలు, ఇతర శాఖలు, భాగస్వాముల అభిప్రాయాలు తెలుసుకున్నట్టు ఓ అధికారి వెల్లడించారు. వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్‌ భత్వాల్‌ దీనికి నేతృత్వం వహించారు.

 హర్ముజ్‌ జలసంధిలో ప్రస్తుతానికి తటస్థ పరిస్థితులే నెలకొన్నట్టు, ఓడల రవాణాలకు ఎలాంటి ఆటంకాల్లేనట్టు ప్రతినిధులు వెల్లడించారు. అభివృద్ధి చెందుతున్న పరిణామాలు, వాణిజ్యంపై వాటి ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేయాల్సి ఉంటుందని వాణిజ్య శాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. పరిస్థితులకు అనుగుణంగా అన్ని ప్రత్నామ్నాయాలను గుర్తించాల్సిన ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పారు. యుద్ధం తీవ్రతరమైతే అది ప్రపంచ వాణిజ్యాన్ని ప్రభావితం చేస్తుందని.. హర్ముజ్‌ జలసంధి, రెడ్‌సీ ద్వారా ఓడల రవాణాకు ఆటంకాలు ఏర్పడతాయని ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేశారు.

 ఈ పరిణామాలతో సముద్ర, వాయు రవాణా చార్జీలు పెరిగిపోయే ప్రమాదం ఉందన్నారు. హర్ముజ్‌ జలసంధిని మూసేస్తామని ఇరాన్‌ ఇప్పటికే హెచ్చరించడం గమనార్హం. కేవలం 21 కిలోమీటర్ల వెడల్పుతో ఉండే ఈ జలసంధి ద్వారానే ప్రపంచంలో 20 శాతం మేర ముడి చమురు రవాణా అవుతోంది. అంతేకాదు మన చమురు దిగుమతుల్లో మూడింట రెండొంతులు, ఎల్‌ఎన్‌జీ దిగుమతుల్లో సగం మేర హర్ముజ్‌ జలసంధి ద్వారానే వస్తున్నాయి. వీటికి ఆటంకాలు ఏర్పడితే చమురు ధరలు, రవాణా, బీమా చార్జీల పెరుగుదలకు దారితీస్తుంది. ఈ ప్రభావం మన దేశ వాణిజ్యంపై గణనీయంగా ఉంటుందనడంలో సందేహం లేదు. అందుకే వాణిజ్య శాఖ ఈ సమావేశం నిర్వహించింది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement