సోలార్ సెల్, మాడ్యూళ్ల తయారీ కంపెనీ అవాడా ఎలక్ట్రో పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. ఈ బాటలో టెక్స్టైల్స్ కంపెనీ సోనాసెలక్షన్ ఇండియా, చెన్నై సంస్థ గ్రాండ్ హౌసింగ్ సైతం ఐపీవో ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యేందుకు అనుమతి పొందాయి. ఈ కంపెనీలన్నిటికీ ఏప్రిల్ 15–17 మధ్య సెబీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది.
భారీస్థాయిలో..
ఐపీవోలో భాగంగా ఈక్విటీ జారీ ద్వారా అవాడా ఎలక్ట్రో 9,000-10,000 కోట్ల మధ్య సమీకరించే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తద్వారా కంపెనీ విలువ రూ. 1.1-1.3 లక్షల కోట్ల మధ్య నమోదయ్యే వీలున్నట్లు అంచనా వేశాయి. కంపెనీ 2025 అక్టోబర్లో గోప్యతా మార్గాన సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. నిధులను సామర్థ్య విస్తరణకు వినియోగించనుంది.
అత్యున్నత సామర్థ్యంగల సోలార్ సెల్, మాడ్యూల్ తయారీపై వెచ్చించనుంది. వీటిలో ఉత్తరప్రదేశ్లో అభివృద్ధి చేస్తున్న 5.1 గిగావాట్ల సమీకృత సౌకర్యాలతోపాటు.. మహారాష్ట్రలోని బ్యూటిబోరీ ప్లాంటు విస్తరణకు నిధులు కేటాయించనుంది. పీఈ దిగ్గజం బ్రూక్ఫీల్డ్కు పెట్టుబడులున్న శుద్ధ ఇంధన అవాడా గ్రూప్ సంస్థ ఇది. సోలార్ పీవీ తయారీ, పునరుత్పాదక విద్యుదుత్పత్తి, గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ స్టోరేజీ, గ్రీన్ డేటా సెంటర్లపై దృష్టిపెట్టి ముందుకు సాగుతోంది.
ఈక్విటీ జారీ..
బిల్వారా కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించిన సోనాసెలక్షన్ ఇండియా ఐపీవోలో భాగంగా 1.43 కోట్ల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఐపీవో నిధులలో రూ. 80 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 48 కోట్లు ప్లాంట్, మెషీనరీ కొనుగోలుకి వెచ్చించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. పబ్లిక్ ఇష్యూలో భాగంగా గ్రాండ్ హౌసింగ్ 3.55 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఐపీవో ద్వారా అవాడా ఎలక్ట్రో, సోనాసెలక్షన్, గ్రాండ్ హౌసింగ్ స్టాక్ ఎక్సే్ఛంజీ(బీఎస్ఈ, ఎన్ఎస్ఈ)లలో లిస్టయ్యే ప్రణాళికల్లో ఉన్నాయి.


