● జిల్లా రైతుల ఆవేదనను పరిగణనలోకి తీసుకోండి ● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు
జూలూరుపాడు: జిల్లా రైతాంగానికి సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలు అందించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. సీపీఐ, రైతు సంఘం నాయకులతో కలిసి శుక్రవారం ఆయన జూలూరుపాడు మండలం వినోభానగర్ గ్రామ సమీపాన రాజీవ్ లింక్, సీతారామ కెనాళ్లను పరిశీలించారు. అలాగే, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల వివరాలపై అధికారులతో చర్చించారు. అనంతరం కూనంనేని మాట్లాడుతూ ఖమ్మం జిల్లాకు గోదావరి జలాల తరలింపుపై తమకు అభ్యంతరం లేదని చెప్పారు. కానీ సీతారామ కెనాల్ నిర్మాణంతో ఇక్కడి రైతులు భూములు కోల్పోయినా నీరు అందకపోవడంపై రైతుల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నందున ప్రభుత్వం పరిశీలించాలన్నారు. ఇకనైనా మండలంలోని కొత్తూరు శనగ చెరువు, జూలూరుపాడు కప్పలకుంట చెరువు, పాపకొల్లు దండేలా చెరువుల్లో నీళ్లు నింపి సుజాతనగర్ మండలం సింగభూపాలెం చెరువుకు తరలించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ విషయాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్కుమార్రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల నిర్మాణానికి మరో ఏడాది పట్టనున్నందున తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. అంతేకాక బూర్గంపాడు, భద్రాచలం, అశ్వారావుపేట, ఇల్లెందు తదితర ప్రాంతాల రైతులకు గోదావరి జలాలు అందించేందుకు రెగ్యూలేటర్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
సింగభూపాలెం చెరువు కట్ట పటిష్టతకు
రూ.5 కోట్లు
సుజాతనగర్ మండలం సింగభూపాలెం చెరువు కట్ట పటిష్టత, రక్షణకు రూ.5 కోట్ల వ్యయంతో చేపట్టే పనులు త్వరలోనే మొదలవుతాయని ఎమ్మెల్యే సాంబశివరావు తెలిపారు. సింగభూపాలెం చెరువును పరిశీలించిన ఆయన మాట్లాడుతూ చెరువుకు సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు తరలించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని చెప్పారు. అంతేకాక కొత్తగూడెంతోపాటు భద్రాచలం, అశ్వారావుపేట, ఇల్లెందు, పినపాక నియోజకవర్గాల్లో సాగు అవసరాలకు గోదావరి జలాలను మళ్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చామన్నారు. కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్, సీతారామ ఈఈ కె.మహేశ్వరరావు, డీఈ చంద్రశేఖర్, ఏఈ శ్రావణి, కేఎంసీ కమిషనర్ సుజాత, ఎంపీడీఓ భారతి, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, నాయకులు గుండెపిన్ని వెంకటేశ్వర్లు, రోశయ్య, మధు, నాగుల్మీరా, నరసింహారావు, రాజేశ్వరరావు, సుధాకర్రావు, శ్రీనివాస్, భూక్యా దస్రు, రాములు, వెంకటేశ్వరరావు, ధర్మయ్య, మహేశ్వరరావు, గోపి పాల్గొన్నారు.


