పయనమెటు?
సత్తుపల్లిటౌన్: రవి తన స్నేహితుడు కిషోర్ కోసం పార్క్లో ఎదురుచూస్తున్నాడు. ఫోన్ చేస్తే ఐదు నిమిషాల్లో వస్తున్నానని చెప్పి గంట అవుతున్నా రాలేదు. ఫోన్ చేస్తే కలవకపోవడంతో కిషోర్కి ఏమైనా అయిందేమోనని రవికి భయం మొదలైంది. హఠాత్తుగా పార్క్లోని జనం కంగారుగా పరిగెత్తుతున్నారు. ఏమిటని రవి ఆరా తీస్తే ఎవరో కుర్రాడికి ప్రమాదం జరిగిందని చెప్పాడు. ఆయన చెప్పిన పోలికలన్నీ కిషోర్వే కావడంతో రవి భయంగా వెళ్లేసరికి గాయపడింది వేరే వ్యక్తి కావడంతో ఊపిరి పీల్చుకున్నాడు. సరిగ్గా అప్పుడే బండిపై వేగంగా కిషోర్ వస్తుండగా హఠాత్తుగా లారీ ఢీకొట్టడంతో ఎగిరి ఆమడదూరాన పడ్డాడు. కళ్ల ముందు జరిగిన ప్రమాదాన్ని చూసి రవి ఏడుస్తూ కిషోర్ వైపు వెళ్లగా ఆయన ఎగిరి పెద్ద బండపై పడగా తలకు బలమైన గాయమై మృతి చెందాడు.
●ఇదంతా టీవీలో చూస్తున్న ఆనంద్కు భయమేసింది. ఎందుకంటే తన కొడుకు ఎప్పుడు హెల్మెట్ పెట్టుకోకపోగా.. బండి వేగంగా నడుపుతుంటాడు. అలాగే, ట్రాఫిక్ నిబంధనలు కూడా పాటించడు. అప్పుడే కాలేజీకి బయలుదేరుతున్న కొడుకుని చూసి ఆనంద్ హెల్మెట్ తీసి ఇచ్చాడు. అది చూసిన కొడుకు ‘హెల్మెట్ ఎందుకు నాన్నా.. ఇది పెట్టుకుంటే జుట్టు చెదిరిపోతుంది.. అయినా నాకేం కాదులే..’అనడంతో అప్పుడే టీవీలో చూసిన ప్రమాదాన్ని ఆనంద్ వివరించాడు. ‘హెల్మెట్ పెట్టుకో నాన్నా.. జట్టు పాడవుతుందని ప్రాణం మీదికి తెచ్చుకుంటావా.. ప్రయాణంలో ప్రమాదం జరిగితే మేము తట్టుకోగలమా..’అనడంతో తండ్రి ఆవేదనను అర్థం చేసుకున్న కుమారుడు అంగీకరించాడు. ఇకపై హెల్మెట్ లేకుండా బయటకు వెళ్లనని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తానని తండ్రికి మాట ఇస్తాడు. కొడుకులో వచ్చిన ఈ మార్పును చూసి తండ్రి ఆనంద్ ఎంతో సంతోషించాడు.


