కొణిజర్ల: అతివేగంగా వస్తున్న బొలేరో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన పల్టీ కొట్టడంతో ఓ యువకుడు మృతి చెందగా ఐదుగురికి గాయాలైన ఘటన మండల పరిధిలోని తనికెళ్లలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఎస్ఐ సూరజ్ కథనం ప్రకారం.. ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కోయమాధారానికి చెందిన చిచ్చడి రాము తన బంధువుల ఇంటి నిర్మాణం నిమిత్తం టైల్స్ తీసుకొచ్చేందుకు బొలేరో వాహనంలో హైదరాబాద్ బయలుదేరాడు. హైదరాబాద్ చూసేందుకని అదే గ్రామానికి చెందిన మొట్టుం సిద్ధు (19), కుంజా చరణ్, పల్లా రాము, కట్టం కార్తీక్, పాయం విష్ణు, తురం రామ్చరణ్, పల్లా రాజశేఖర్ అదేవాహనంలో వెళ్లారు. హైదరాబాద్ నుంచి టైల్స్లోడు చేసుకుని తిరుగు ప్రయాణంలో తనికెళ్ల విజయ కళాశాల సమీపంలోని ఓ పెట్రోలు బంక్ వద్ద ఆగి ఉన్న లారీ ఒకేసారి రోడ్డు పైకి రావడంతో దానిని తప్పించబోయి బొలేరో రోడ్డు పక్కన పల్టీ కొట్టింది. క్యాబిన్లో కూర్చున్న ఆరుగురు యువకులు కింద పడటంతో వారిపైన టైల్స్ పడ్డాయి. మొట్టుం సిద్ధు అక్కడికక్కడే మృతిచెందాడు. ట్రక్లో ఉన్న కుంజా చరణ్, కుంజా మంగరాజు, కారం రాంబాబు, కట్టం కార్తీక్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 ద్వారా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేశారు.
ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు


