పాల్వంచ: పాల్వంచలోని శ్రీనివాస గిరి భక్తుల కోలాహలంతో సందడిగా మారింది. గోవింద నామస్మరణతో మారుమోగింది. అశేష భక్త జన సందోహాం నడుమ శ్రీనివాసకాలనీ గుట్టపై ఉన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం శ్రీదేవి, భూదేవి సమేత స్వామి వారి కల్యాణం కనులపండువగా నిర్వహించారు. గర్భగుడి నుంచి ఉత్సవ మూర్తులను పల్లకీలో మేళతాళాలతో కల్యాణ మండపానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం శ్రీవారి కల్యాణాన్ని వనపర్తికి చెందిన సౌమిత్రి రామాచార్యులు, హైదరాబాద్కు చెందిన హరిచార్యులు, తోలేటి నగేశ్శర్మ, ఆరుట్ల ఫణిరాజాచార్యులు, సంపత్కుమార్ అప్పలాచార్యులు శాస్త్రోక్తంగా జరిపించారు. వేలాది మంది భక్తులు తరలి రావడంతో శ్రీనివాసగిరి కిటకిటాడింది.
ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు
1,600 మెట్లు ఎక్కి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బదులు తలెత్తకుండా భక్తులకు తాటి ఆకులతో చలువ పందిళ్లు వేశారు. ప్రత్యేక కౌంటర్ల ద్వారా తీర్థ ప్రసాదాలు, అక్షింతలు అందించారు. ఆలయ నిర్వాహకులు తాగునీటి వసతి కల్పించారు. గుట్టపైకి వచ్చే వారికి మెడికల్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పాల్వంచ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎస్పీ రోహిత్రాజు, కొత్వాల శ్రీనివాసరావు, డీసీసీ అధ్యక్షులు తోట దేవీప్రసన్న, నాగా సీతారాములు, డిప్యూటీ మేయర్ లలితకుమారి, కొత్త వెంకటేశ్వరరావు, డాక్టర్ ముక్కంటేశ్వరరావు, ఆరుట్ల లక్ష్మణాచార్యులు, డాక్టర్ బిక్కసాని సుధాకర్, ఊకే భద్రయ్య, శ్రీలత, భక్తులు పాల్గొన్నారు.
గోవింద నామస్మరణతో మార్మోగిన శ్రీనివాసగిరి


