బూర్గంపాడు: ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థుల ఆరోగ్యంపై ఉపాధ్యాయులు, వార్డెన్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని డీఎంహెచ్ఓ తుకారాంరాథోడ్ అన్నారు. ఉప్పుసాకలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు హ్యాండ్వాష్ టెక్నిక్స్ వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ ఎలా చేయాలో తెలిపారు. పరీక్షల సమయంలో ఒత్తిడిని అధిగమించటం, భావోద్వేగాలను నియంత్రించుకోవటం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డీవార్మింగ్ కార్యక్రమంలో భాగంగా అల్బెండజోల్ మాత్రలు వేయించారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రతాప్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
రంజాన్ను ఘనంగా జరుపుకోవాలి
పాల్వంచ: ముస్లింలు పవిత్ర రంజాన్ పండుగను ఘనంగా జరుపుకోవాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఆదివారం నటరాజ్ సెంటర్లోని జమా మసీద్లో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ రంజాన్ ఐక్యతను చాటుతుందని, తోటి వారికి సహాయం చేయాలనే ఉద్దేశాన్ని తెలుపుతుందని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వనమా రాఘవేందర్ రావు, మల్లెల రవిచంద్ర, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
17 మిలియన్
టన్నుల లక్ష్యం
రుద్రంపూర్: సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యసాధన కోసం కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో మార్చి 15వ తేదీ వరకు 67.76 మిలియన్ టన్నులు సాధించాల్సి ఉండగా, 55.00 మిలియన్ టన్నులు 81 శాతం ఉత్పత్తి చేసింది. రానున్న మార్చి 31 నాటికి 72 మిలియన్ టన్నుల ఉత్పత్తి పూర్తి చేయాల్సి ఉంది. అంటే ఈ 15 రోజుల్లో 17 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయాలి. గతేడాది ఈరోజు నాటికి 63.50 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించగా.. ఈ ఏడాది 55.00 మిలియన్ టన్నులు ఉత్పత్తి కాగా.. సుమారు 8.50 మిలియన్ టన్నులు వెనుకబడింది.
అటవీ అధికారిణిని
బెదిరించిన వ్యక్తి అరెస్ట్
చండ్రుగొండ: మండలంలోని బ్రహ్మలకుంట ఫారెస్ట్ బీట్ అధికారిణి పూనెం లావణ్యను బెదిరింపులకు గురి చేసిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ శివరామకృష్ణ ఆదివారం రాత్రి తెలిపారు. బ్రహ్మలకుంట ఎఫ్బీఓ లావణ్యను బెండాలపాడు గ్రామానికి చెందిన కారం సునీల్ అలియాస్ బంటి ఈ నెల 12న బెదిరింపులకు గురిచేశారు. కేసు నమోదు చేసి, సునీల్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ వెల్లడించారు.
రేషన్ బియ్యం పట్టివేత
చుంచుపల్లి: లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల గ్రామంలో అక్కిరెడ్డి సురేశ్ ఇంటి నుంచి రేషన్ బియ్యం రవాణా జరుగుతోందనే సమాచారం మేరకు ఆదివారం రెవెన్యూ అధికారులు తనిఖీ చేశారు. 10 క్వింటాళ్ల బియ్యాన్ని 24 బస్తాల్లో నింపి, వాహనంలో తరలిస్తుండగా పట్టుకొని సీజ్ చేశారు. అక్కిరెడ్డి సురేశ్, భూక్యా లాలు, శ్యామ్పై కేసు నమోదు చేశారు. మండలంలో పలుచోట్ల తనిఖీలు నిర్వహించి, అక్రమంగా నిల్వ ఉంచిన 14 గ్యాస్ సిలిండర్లను గుర్తించారు.
ద్విచక్రవాహనం, లారీ ఢీ
కొణిజర్ల: మండలంలోని గుబ్బగుర్తి సమీపంలో ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో మండలంలోని అన్నవరం గ్రామానికి చెందిన బాణోత్ గణేశ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 ద్వారా ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. 108 సిబ్బంది సతీశ్, మోహనకృష్ణ ప్రాథమిక చికిత్స అందించారు.


