● విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే సహించం ● మణుగూరులో కలెక్టర్ అంకిత్ సుడిగాలి పర్యటన
మణుగూరు టౌన్: విద్యార్థుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కలెక్టర్ అంకిత్ తెలిపారు. గురువారం ఆయన మణుగూరు మండలంలో విస్తృతంగా పర్యటించారు. తొలుత 100 పడకల ఆస్పత్రిని తనిఖీ చేసి వార్డులు, ఔషధ నిల్వల గది, ఔట్ పేషెంట్ విభాగం, సిబ్బంది హాజరు వివరాలను పరిశీలించారు. పేషెంట్లతో మాట్లాడి వైద్య సేవలు ఎలా అందుతున్నాయని ఆరా తీశారు. ఆస్పత్రి ఆవరణ పరిశుభ్రంగా ఉండాలని, 24 గంటలూ వైద్యులు అందుబాటులో ఉండాలని సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం జెడ్పీ ఉన్నత పాఠశాల, ఆశ్రమ గిరిజన ఉన్నత పాఠశాలలను సందర్శించి తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, కిచెన్ షెడ్, స్టోర్ రూమ్లో నిల్వ ఉంచిన బియ్యం, పప్పులు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి పరీక్షలకు సిద్ధం కావాలని, 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత, పరిశుభ్రత పాటించేలా చర్యలు చేపట్టాలని హెచ్ఎం నాగశ్రీని ఆదేశించారు. అనంతరం గుండు సింగారం గ్రామంలో అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ గిరిజన మోడల్ ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో మహిళా శిశు సంక్షేమ శాఖఅధికారి స్వర్ణలత లెనీనా, 100 పడకల ఆస్పత్రి సూపరింటెండెంట్ సునీల్, వైద్యులు గౌరీశంకర్, నిఖిల్, ఉపాధ్యాయులు మహాలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్, ఎంఈఓ స్వర్ణజ్యోతి, ఎంపీఓ పల్నాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఈవీఎం గోడౌన్ తనిఖీ
సూపర్బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ అంకిత్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు మూడు నెలలకు ఒకసారి ఈవీఎంలను తనిఖీ చేస్తామని చెప్పారు. అనుమతి లేనిదే ఎవరినీ లోపలికి అనుమతించొద్దని అధికారులు, సెక్యూరిటీ సిబ్బందికి సూచించారు. ఆయన వెంట కొత్తగూడెం తహసీల్దార్ పుల్లయ్య, ఎన్నికల సూపరింటెండెంట్ రంగా ప్రసాద్, డీఎల్ఎంటీ సాయికృష్ణ, ఆయా పార్టీల నాయకులు నోముల రమేష్, జయశ్రీలక్ష్మి, రాంబాబు, ఎల్.బాలరాజు, ఎ.సత్యనారాయణ, ఎన్నికల సిబ్బంది నవీన్ ఉన్నారు.


