ఉపాధి పనులతో ఆర్థికాభివృద్ధి
● డీఆర్డీఓ విద్యాచందన
జూలూరుపాడు: ఉపాధి పనులతో కూలీలు ఆర్ధికాభివృద్ధి సాధించాలని డీఆర్డీఓ విద్యాచందన అన్నారు. సోమవారం ఆమె జూలూరుపాడు, మాచినేనిపేటతండా గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పనులను పరిశీలించారు. కూలీలతో మాట్లాడారు. పని ప్రదేశాల్లో నీడ, తాగునీరు ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆమె ఆదేశించారు. ఎంపీడీఓ పూరేటి అజయ్, ఎంపీఓ టి.తులసిరామ్, సిబ్బంది రామారావు, సైదులు, ఖాదర్మియా, జ్యోతి పాల్గొన్నారు.
పారిశ్రామిక విద్యతో భవిష్యత్
మణుగూరు రూరల్ : విద్యార్థల బంగారు భవిష్యత్కు పారిశ్రామిక విద్య బాటలు వేస్తుందని మణుగూరు ప్రభుత్వ ఐటీఐ ఏటీఓ ఎం శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం సమితి సింగారంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐటీఐ, ఏటీసీల అడ్మిషన్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఏటీసీ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఐటీఐ చదివితే సత్వర ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఏటీసీలలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. పాఠశాల ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయుడు పరమయ్య, ఐటీఐ సిబ్బంది పూర్ణచందర్రావు, చైతన్య, భార్గవ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఆదివాసీ గిరిజన సంఘం కమిటీ ఎన్నిక
ములకలపల్లి: ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడిగా కరపటి గోపాలరావు నియమితులయ్యారు. ములకలపల్లిలో సోమవారం నిర్వహించిన సమావేశంలో జిల్లా కమిటీని ప్రకటించారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా సున్నం బా బూరావు, ఉపాధ్యక్షుడిగా సోయం వీరస్వామి, సహాయ కార్యదర్శిగా సున్నం సుశీలతోపాటు మరికొందరిని సభ్యులు నియమించారు.
రేషన్ దుకాణాల్లో నిత్యావసరాలు..?
● బియ్యంతోపాటు పంపిణీ చేసేందుకు ప్రభుత్వ నిర్ణయం
దుమ్ముగూడెం : రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ఇక నుంచి నిత్యాసవరాలు కూడా అందించనుంది. ఇప్పటికే సన్న బియ్యం ఇస్తుండగా, తాజాగా ఐదు రకాల నిత్యావసర సరుకులు అందించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా తొమ్మిది రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేసింది. సన్న బియ్యంతో పాటు ఐదు రకాల నిత్యావసర సరుకులు రేషన్ కార్డుదారులకు అందజేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా గతంలో ప్రకటించారు. బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార, గోధుమలు, జొన్నలు, రాగులు వంటి పోషక విలువలున్న ఆహార పదార్థాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. నిత్యావసరాల పంపిణీ అమల్లోకి వస్తే భద్రాచలం డివిజన్ వ్యాప్తంగా 41,246 మంది కార్డుదారులకు లబ్ధి జరగనుంది.
టీపీసీసీ లీగల్, ఆర్టీఐ
రాష్ట్ర కన్వీనర్గా రమేశ్
కొత్తగూడెంఅర్బన్: టీపీసీసీ లీగల్, ఆర్టీఐ విభాగం రాష్ట్ర కన్వీనర్గా అడ్వకేట్ మారపాక రమేశ్కుమార్ను నియమిస్తూ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్గౌడ్ సోమవారం హైదరాబాద్లో నియామకపత్రం అందించారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి రమేశ్కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాదులు, రాష్ట్ర టీపీసీసీ సెల్ కన్వీనర్ ఆకుల సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు.
ఉపాధి పనులతో ఆర్థికాభివృద్ధి
ఉపాధి పనులతో ఆర్థికాభివృద్ధి
ఉపాధి పనులతో ఆర్థికాభివృద్ధి


