ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
సూపర్బజార్(కొత్తగూడెం): మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీస్ అధికారులు, సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలని ఎస్పీ రోహిత్రాజ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈసీ ఆదేశాల మేరకు ఇతర శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ 8 ఫ్లయింగ్ స్క్వాడ్, 4 సర్వైలెన్స్ బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా మూడు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 288 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగనుండగా ఇందులో 125 సున్నిత కేంద్రాలుగా, 15 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామని తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ప్రజలు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా బాధ్యతగా విధులు నిర్వర్తించాలని సూచించారు. బరిలో ఉండేవారు సంబంధిత అధికారుల నుంచి అనుమతి పొందిన తర్వాతే ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. లేదంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఓటర్లను ప్రలోభపరిచేలా నగదు, మద్యం, ఇతర సామగ్రిని అక్రమ రవాణా చేస్తూ పట్టుబడితే చట్టప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సమావేశంలో కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు డీఎస్పీలు ఆదినారాయణ, సతీష్ కుమార్, వెంకన్నబాబు, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సీఐలు ప్రతాప్, కరుణాకర్, ఇంద్రాసేనారెడ్డి, సతీష్, సురేష్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఎస్పీ రోహిత్ రాజ్


