జీవితాన్ని మార్చే ఆయుధం విద్య
సూపర్బజార్ (కొత్తగూడెం): విద్య జీవితాన్ని మార్చే ఆయుధని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నా రు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న 16 షెడ్యూల్డ్ కులాల వసతి గృహాల్లో 10వ తరగతి చదువుతున్న 212 మంది విద్యార్థులకు ఆదివారం కొత్తగూడెం క్లబ్లో ప్రేరణ శిక్షణ తరగతులు నిర్వహించారు. కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయిలో స్థిరపడాలని సూచించారు. చదువుతోపాటు క్రమశిక్షణ, సమయపాలన, పట్టుదల అలవర్చుకోవాలని ఉద్బోధించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రేరణ, శిక్షణ తరగతులతో విద్యార్థులలో చదువుపై ఆసక్తి పెరిగి, మెరుగైన ఫలితాలు సాధించవచ్చని అన్నారు. అనంతరం నిపుణులు ప్రతి సబ్జెక్టులో ముఖ్యమైన అధ్యాయాలు, ప్రశ్నల రూపకల్పన, సమయ నిర్వహణ, పరీక్షలలో మార్కుల సాధన తదితర అంశాలపై బోధించారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి ఎ.శ్రీలత, ఇతర అధికారులు కొప్పుల హనుమంతరావు, సీహెచ్ అక్షయ్, ఆర్వీఆర్ ప్రసాద్, నరసింహారావు, సాయి చరణ్, నాగలక్ష్మి, సిబ్బంది తారాచంద్, మోహన్ రావు, దస్తగిరి, బివిఎల్. కుమార్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
కర్రమాస్క్ యూనిట్ సందర్శన..
ములకలపల్లి: మండల పరిధిలోని మాధారం గ్రామంలో ఉన్న నాయకపోడు కర్ర మాస్క్ యూనిట్ను కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాస్క్లకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభిస్తోందని అన్నారు. యూనిట్ను అభివృద్ధి చేసేందుకు గురుశిక్ష హస్త శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని తెలిపారు. 30 మంది నాయకపోడు నిరుద్యోగ యువతీ యువకులకు సోమవారం నుంచి ఉచితంగా శిక్షణ ప్రారంభమవుతుందని అన్నారు. శిక్షణ కాలంలో రోజుకు రూ. 300 స్కాలర్షిప్ అందిస్తామన్నారు.
కలెక్టర్ జితేష్ వి.పాటిల్


