
ఎట్టకేలకు ‘కారుణ్యం’!
● డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇచ్చేందుకు సుముఖత ● జెన్కో పరిధిలో మూడేళ్లుగా ఎదురుచూస్తున్న 110 కుటుంబాలు
పాల్వంచ: టీజీ జెన్కో పరిధిలో కారుణ్య నియామకాల(డిపెండెంట్)కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మూడేళ్లుగా ఎదురుచూస్తున్న బాధిత కుటుంబ సభ్యులకు వారంలోగా పోస్టింగ్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ విద్యుత్ సౌధలో జెన్కో డైరెక్టర్(హెచ్ఆర్)కుమార్ రాజ్ను పలు యూనియన్ల నాయకులు కలిసి విన్నవించగా హామి ఇచ్చారు. ఈ నెల 18వ తేదీలోగా పోస్టింగ్లు ఇవ్వాలని తొలుత యోచించినా, తేదీ ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది. జెన్కో వ్యాప్తంగా విధులు నిర్వహిస్తూ అకాల మృత్యువాత పడ్డవారు సుమారు 110 మంది ఉన్నారు. అందులో అత్యధికంగా కేటీపీఎస్ కాంప్లెక్స్లో 76 మంది ఉండటం గమనార్హం. వారి కుటుంబాలు ఉద్యోగాలు కోసం ఎదురుచూస్తున్నాయి. గతంలో డైరెక్టర్ పోస్టులు ఖాళీ ఉండటంతో వాయిదా ఈ ప్రక్రియ వాయిదా పడింది. ఇటీవల డైరెక్టర్ పోస్టులు భర్తీ చేయడంతో కారుణ్య నియామకాల ప్రక్రియ వేగవంతమైంది.
సబ్ ఇంజనీర్ పోస్టులపై మీమాంస
గతంలో డిప్లొమా ఉన్న వారిని సబ్ ఇంజనీర్గా నియమించారు. గత సీఎండీ ప్రభాకర్ రావు హయాంలో ఇంజనీర్ కేడర్ను తొలగించి జూనియర్ అసిస్టెంట్(ఎల్డీసీ)గా ఉద్యోగాలు కల్పించారు. ఇది సాంకేతికంగా సరైంది కాదని, వారి చదువుకు, ఉద్యోగానికి సంబంధం లేదని సబ్ ఇంజనీర్ పోస్టు ఇవ్వాలని యూనియన్లు కోరుతున్నాయి. ఎన్పీడీసీఎల్, ట్రాన్స్కో సంస్థల్లో పాటించారని, సబ్ ఇంజనీర్నే పరిగణనలోకి తీసుకుని ఉద్యోగాలు ఇస్తున్నారని జెన్కో యాజమాన్యానికి వివరించారు. నూతనంగా నియామకమైన డైరెక్టర్లు మాత్రం డిప్లొమా, బీటెక్ ఉన్నవారిని సైతం జేపీఏ(జూనియర్ ప్లాంట్ అటెండెంట్)గా తీసుకుని సాధ్యమైనంత త్వరగా సబ్ ఇంజనీర్గా పదోన్నతులు కల్పిస్తామని పేర్కొనడంతోపాటు సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రొబేషనరీ పీరియడ్ దాటకుండా కన్వర్షన్ అయ్యే పరిస్థితి లేదని, కనీసం ఐదారేళ్లు పడుతుందని యూనియన్ నాయకులు చెబుతున్నారు. సబ్ ఇంజనీర్ పోస్టులు ఖాళీ ఉన్న నేపథ్యంలో సబ్ ఇంజనీర్గానే తీసుకోవాలని డైరెక్టర్ కుమార్ రాజును కోరారు. రాతపూర్వకంగా ఇవ్వాలని డైరెక్టర్ కోరగా బుధవారం విద్యుత్ సౌధలో 1104 కంపెనీ జనరల్ సెక్రటరీ దుర్గా అశోక్, 327 నాయకులు కుమార స్వామి, 1535 నాయకులు ఎంఎ.వజీర్, టీఆర్వీకేఎస్ నాయకుడు నవీన్ వర్మ వేర్వేరుగా వినతి పత్రాలు అందించారు.