
‘సరోగసీ’పై నిఘా!
● ఫెర్టిలిటీ సెంటర్ల నియంత్రణకు సర్కార్ చర్యలు ● జిల్లాలో తనిఖీలు చేపట్టనున్న రాష్ట్ర స్థాయి అధికారులు ● సృష్టి ఘటన నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్ ● జిల్లా స్థాయిలోనూ ముమ్మరంగా తనిఖీలు
ఖమ్మంవైద్యవిభాగం: సరోగసీ ముసుగులో హైదరాబాద్లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ చేసిన నిర్వాకాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ మేరకు హైదరాబాద్ సహా వివిధ జిల్లాల్లో టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ల తీరును తెలుసుకునేందుకు ప్రత్యేక టీమ్లు ఏర్పాటుచేసింది. ఈ క్రమంలో జిల్లాలోని టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లను త్వరలో తనిఖీ చేయనుండగా నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కేంద్రాల నిర్వాహకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. జిల్లాలో ప్రస్తుతం ఏడు టెస్ట్ట్యూబ్ బేబీ సెంటర్లకు అనుమతి ఉండగా వాటిలో రెండు సెంటర్లు సరోగసీకి అనుమతి తీసుకున్నారు. ఇంకా పర్మిషన్ లేకుండా అనేక సెంటర్లు పుట్టుకొచ్చాయి.
త్వరలోనే ఉన్నతాధికారుల పరిశీలన..
హైదరాబాద్ తర్వాత మెడికల్ హబ్గా వరంగల్, కరీంనగర్, ఖమ్మం నగరాలకు పేరుంది. కాగా ఖమ్మంలో తక్కువ సమయంలో ఎక్కువ సంతాన సాఫల్య కేంద్రాలు వెలిశాయి. జిల్లాకు అనుకుని ఉన్న భద్రాద్రి, సూర్యాపేట, మహబూబాబాద్, ఏపీలోని కృష్ణా జిల్లాల నుంచి వైద్య సేవల కోసం ఎక్కువగా ఖమ్మం వస్తుంటారు. దీనికి తోడు ఆర్ఎంపీలు కమీషన్ల ప్రాతిపదికన పేషెంట్లను తీసుకొస్తుంటారు. ఇదే అదనుగా ఇటీవల సంతాన సాఫల్య కేంద్రాలు కూడా పుట్టుకొచ్చాయి. పిల్లలు లేని దంపతులకు వల వేసి ఆయా సెంటర్లకు తీసుకొస్తుండగా తమ వద్ద చికిత్స తీసుకుంటే 100 శాతం పిల్లలు పుట్టడం గ్యారంటీ అంటూ సెంటర్ల నిర్వాహకులు రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయా సెంటర్ల అక్రమాలకు చెక్ పెట్టేందుకు త్వరలోనే తనిఖీలకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
జిలా స్థాయిలో తనిఖీలు..
హైదరాబాద్ ఘటన కలకలంతో కలెక్టర్ వైద్యారోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. అనుమతి లేని టెస్ట్ట్యూబ్ బేబీ సెంట ర్లు, నిబంధనలు పాటించని ఆస్పత్రుల్లో తని ఖీలు చేయాలని ఆదేశించారు. దీంతో ఈనెల 1న తనిఖీలు ప్రారంభించారు. వైరా రోడ్లోని రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ను తనిఖీ చేశారు. అలాగే వైరారోడ్లోని మార్వెల్స్ హాస్పిటల్లో గతంలో సుమారు 168మందికి చికిత్స అందించినట్లు నకిలీ బిల్లులు ఇవ్వగా.. వారు సీఎంఆర్ఎఫ్ బిల్లుల కోసం సమర్పించినట్లు తేలడంతో ఆస్పత్రిని సీజ్ చేశారు. మయూరిసెంటర్లోని బ్రీత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల ఓ మహిళ మృతి చెందడానికి డాక్టర్, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని కలెక్టర్ దృష్టికి వెళ్లగా ఆయన ఆదేశాల మేరకు డీఎంహెచ్ఓ, సిబ్బంది వెళ్లి విచారించారు. మహిళ మృతికి వారి నిర్లక్ష్యమే కారణమని గుర్తించి ఆస్పత్రిని సీజ్ చేశారు. అయితే జిల్లాస్థాయిలో చేపట్టిన తని ఖీలు సాదారణమైనవే కాగా హైదరాబాద్ నుంచి వచ్చే బృందాల తనిఖీలతో ఎవరి బాగోతాలు బయటపడతాయో త్వరలో తేలనుంది.

‘సరోగసీ’పై నిఘా!

‘సరోగసీ’పై నిఘా!