
‘ఉద్దీపనం’తో నైపుణ్యాలు మెరుగుపడాలి
ఐటీడీఏ పీఓ రాహుల్
భద్రాచలం: గిరిజన విద్యార్థుల్లో ప్రాథమిక స్థాయిలో నైపుణ్యాలను పెంచేందుకు రూపొందించిన ఉద్దీపనం మెటీరియల్కు సాధికారత లభించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. గురువారం ఆయన ఐటీడీఏ సమావేశ మందిరంలో పీజీహెచ్ఎం, హెచ్ఎంలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాఠశాలలు, హాస్టళ్లలో అమలవుతున్న మెనూ, తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఉద్దీపనం మెటీరియల్తో సత్ఫలితాలు వచ్చాయని, వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు. నవంబర్లో ప్రతిభా పరీక్షలు నిర్వహిస్తామని, ఈ లోగా విద్యార్థులకు వర్క్బుక్పై పూర్తి స్థాయిలో అవగాహన రావాలని అన్నారు. పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది సమష్టిగా పని చేయాలని సూచించారు. సెప్టెంబర్ నుంచి ప్రతి ఇనిస్టిట్యూట్లో ఎఫ్ఆర్ఎస్ ద్వారా హాజరు తీసుకునేలా యాప్ను ప్రవేశపెడుతున్నామని తెలిపారు. సమావేశంలో డీడీ మణెమ్మ, ఏసీఎంఓ రమేష్, ఏటీడీఓలు అశోక్కుమార్, చంద్రమోహన్, రాధమ్మ తదితరులు పాల్గొన్నారు.
పీఓకు బ్రహ్మకుమారీ రాఖీ..
ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం మాతలు ఐటీడీఏ పీఓకు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా సంస్థ చేపడుతున్న కార్యకలాపాలను వివరించారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిదులు కృష్ణవేణి, భావన తదితరులు పాల్గొన్నారు.
తల్లిపాలు అమృతంతో సమానం
తల్లిపాలు అమృతంతో సమానమని, బిడ్డ పుట్టిన వెంటనే పాలు ఇచ్చేలా ప్రతీ తల్లికి అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, పీఓ రాహుల్ అన్నారు. సబ్ కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల్లో వారు మాట్లాడుతూ.. పుట్టిన గంటకే తల్లిపాలు అందేలా వైద్యులు, అంగన్వాడీ సిబ్బంది చర్యలు తీసుకోవాలని సూచించారు. కనీసం ఆరు నెలల వరకు తల్లి పాలు ఇప్పించేలా చూడాలన్నారు. అనంతరం గర్భిణులకు బాలామృతం అందజేయగా, ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సీమంతం నిర్వహించారు. కార్యక్రమంలో సబ్కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ, డీడబ్ల్యూఓ స్వర్ణలత లెనినా, సీడీపీఓ జ్యోతి, సూపర్వైజర్లు అనసూయ, చంద్రకళ పాల్గొన్నారు.