
నాటుకోళ్ల మృతిపై ఫిర్యాదు
దుమ్ముగూడెం: మండలంలోని గౌరారం గ్రామానికి చెందిన కట్టోజు సరస్వతికి చెందిన నాటుకోళ్లకు విషగులికలు పెట్టి హతమార్చగా.. కారుకులైనవారిపై చర్యలు తీసుకోవాలని బుధవారం బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ నెల 4వ తేదీన సరస్వతి కుటుంబ సభ్యులందరూ ఇల్లెందుకు వెళ్లారు. ఇంట్లో ఉన్న సుమారు 50 నాటుకోళ్లను ఉదయం పూట వదిలిపెట్టాలని పక్కింటి వారికి చెప్పారు. వారు నాటుకోళ్లను వదిలిపెట్టగా ఇంటి దగ్గర్లో ఉన్న పొలంలోకి వెళ్లగా.. యజమాని గుళికలు కలిపాడు. దీంతో ఇంటి ఎదుట 20 కోళ్లు మృతి చెందగా మరో 30కోళ్లు కనిపించకుండా పోయాయి. నాటుకోళ్లు మృతి చెందడంతో సుమారు రూ.లక్ష వరకు నష్టపోయామని బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ఐదు మట్టి ట్రాక్టర్లు సీజ్
అశ్వారావుపేటరూరల్: రెవెన్యూ శాఖ నుంచి అనుమతి లేకుండా మట్టి రవాణా చేస్తున్న ట్రాక్టర్లను బుధవారం స్థానిక తహసీల్దార్ సీహెచ్వీ రామకృష్ణ పట్టుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని పేరాయిగూడెం శివారు నుంచి అశ్వారావు పేట వైపు వస్తున్న మట్టి ట్రాక్టర్లను సమాచారం మేరకు దాడి చేసి అదుపులోకి తీసుకుని, తహసీల్దార్ కార్యాలయానికి తరలించి సీజ్ చేశారు. కాగా, అనుమతి లేకుండా మట్టి, ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హెచ్చరించారు.
పేకాటరాయుళ్ల అరెస్ట్
టేకులపల్లి: పేకాట ఆడుతున్న ఐదుగురిని బోడు పోలీసులు అరెస్ట్ చేశారు. టేకులపల్లి మండలం లచ్చగూడెం శివారు మామిడి తోటలో కొందరు పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు బోడు ఎస్ఐ పి.శ్రీకాంత్ ఆధ్వర్యాన బుధవారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా లచ్చగూడెం, కిష్టారంవాసులు ఐదుగురిని అరెస్ట్ చేయగా, ముగ్గురు పరారయ్యారు. అదుపులోకి తీసుకున్న వారి నుంచి రూ.3,200 నగదు, సెల్ఫోన్లు, మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ తెలిపారు.
అసభ్య ప్రవర్తన కేసులో 20 ఏళ్ల జైలుశిక్ష
ఖమ్మం లీగల్/వైరా: బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో వైరా మండలం గొల్లెనపాడుకు చెందిన 70ఏళ్ల చెరుకూరి లాలయ్యకు 20ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ జిల్లా పోక్సో–1 కోర్టు ఇన్చార్జి న్యాయాధికారి కె.ఉమాదేవి బుధవారం తీర్పుచెప్పారు. అంతేకాక ఆయనకు రూ.50వేల జరిమానా విదించారు. గత ఏడాది ఫిబ్రవరి 2న బాధిత బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా లాలయ్య తన ఇంటికి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. ఘటనపై బాలిక తల్లి ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేయగా, విచారణలో నేరం రుజువు కావడంతో జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.డీ.ఇర్షాద్ వాదించగా.. సిబ్బంది కె.చిరంజీవి, శ్రీకాంత్, ఆర్.నాగేశ్వరావు, చిట్టిబాబు సహకరించారు. కాగా, విచారణలో పాల్గొన్న సీఐ ఎన్.సాగర్, ఎస్సై పి.రామారావు, కానిస్టేబుల్ కె.చిరంజీవి సీపీ సునీల్దత్ అభినందించారు.

నాటుకోళ్ల మృతిపై ఫిర్యాదు