
పత్తి సాగుకే సై
● తెల్లబంగారం వైపే మొగ్గుచూపుతున్న రైతులు ● మద్దతు ధర పెరగటంతో ఆసక్తి ● జిల్లాలో పెరగనున్న పంట సాగు ● సీసీఐ కొనుగోళ్లతో మార్కెటింగ్ సౌలభ్యం
బూర్గంపాడు: జిల్లాలో ఈ ఏడాది పత్తి సాగు మరింతగా పెరగనుంది. కేంద్ర ప్రభుత్వం పత్తికి క్వింటాకు రూ.589 మద్దతు ధర పెంచగా రూ. 8,110కి చేరింది. దీంతో సాగు విస్తీర్ణం అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక పత్తిని సీసీఐ ఆధ్వర్యంలో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుండగా రైతులకు మార్కెటింగ్ సౌలభ్యం కూడా ఉంది. దీనికి తోడు గత రెండేళ్లుగా మిర్చికి గిట్టుబాటు ధర లేకపోవడం, దిగుబడి తగ్గడం, మార్కెటింగ్ వసతులు లేకపోవడం వంటి కారణాలతో ఈ పంట సాగుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఆ భూముల్లోనూ ఈసారి పత్తి సాగయ్యే అవకాశం ఉంది.
ఆది నుంచీ ఇటు వైపే..
జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసే పంటగా పత్తికి మొదటి ప్రాధాన్యత దక్కుతుంది. దిగుబడి తగ్గి, గిట్టుబాటు ధర లభించకపోయినా రైతులు ఈ పంట సాగును వదలడం లేదు. గత రెండేళ్లుగా ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పత్తి ఆశించిన దిగుబడి రాలేదు. ఎకరాకు సగటున 6, 7 క్వింటాళ్లు మాత్రమే పండింది. ప్రైవేట్ వ్యాపారులు గిట్టుబాటు ధర పెట్టలేదు. సీసీఐ ఆధ్వర్యంలో జిల్లాలో నాలుగు జిన్నింగ్ మిల్లుల వద్దనే పత్తి కొనుగోలు చేయగా.. రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. రవాణా, హమాలీ చార్జీలు వారే భరించాల్సి వచ్చింది. అయితే ఈ ఏడాది జిల్లాలో మరో రెండు జిన్నింగ్ మిల్లులు అందుబాటులోకి రానున్నాయి. బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో గతంలో ఒక జిన్నింగ్ మిల్లు అందుబాటులో ఉండగా, ఈ ఏడాది మరో రెండు జిన్నింగ్ మిల్లులు అందుబాటులోకి రానున్నాయి. పత్తికి మద్దతు ధర పెరగడం, జిన్నింగ్ మిల్లులు అదనంగా అందుబాటులోకి రావడంతో రైతులు ఈ పంట వైపే మొగ్గు చూపుతున్నారు.
తగ్గనున్న మిర్చి సాగు..
జిల్లాలో గతేడాది మిర్చిసాగు విస్తీర్ణం బాగా పెరిగింది. అయితే నల్లి, తామర వంటి చీడపీడలతో పాటు ఆశించిన ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో ఈ ఏడాది మిర్చి సాగు మరింతగా తగ్గే అవకాశాలున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో పప్పు గింజలకు డిమాండ్ ఉంది. గత ఐదారేళ్లుగా కంది, మినుము, పెసర, శనగ, బొబ్బెర వంటి పప్పు గింజల ధరలు క్రమేపీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం పప్పు గింజల ధర క్వింటాకు రూ.10వేల వరకు ఉంది. అయినా పప్పు ధాన్యాల సాగుకు రైతులు మాత్రం అనాసక్తి కనబరుస్తున్నారు. వాణిజ్య పంటల సాగుకు అలవాటు పడిన రైతులు సంప్రదాయ అపరాల సాగుకు విముఖత చూపుతున్నారు.
పత్తే వేస్తున్నాం
గత రెండేళ్లుగా మిర్చి వేసి నష్టపోయాను. ఈ ఏడాది మిర్చికి బదులు పత్తి వేస్తున్నా. పత్తికి మార్కెట్లో ధర తక్కువగా ఉన్నా.. సీసీఐ ఆధ్వర్యంలో ప్రభుత్వం కొనుగోలు చేసి మద్దతు ధర అందిస్తోంది. మిర్చి అమ్ముకోవాలంటే గుంటూరు లేదా జగదల్పూర్ వెళ్లాల్సి వస్తోంది. మిర్చి నిల్వ చేద్దామంటే జిల్లాలో కోల్డ్ స్టోరేజీలు లేవు. దీంతో రైతులు పత్తిసాగుకే మొగ్గు చూపుతున్నారు.
– తెల్లం భాస్కర్, రైతు, గుండాల
2లక్షల ఎకరాలకు పైగా..
గతంలో జిల్లాలో సుమారు 1.85 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఈ ఏడాది అది 2.20 లక్షల ఎకరాలకు పెరిగే అవకాశం ఉంది. ఇందులో 95శాతం మేర వర్షాధారంగానే సాగు చేస్తున్నారు. నీటి పారుదల అవకాశాలున్న భూముల్లో వరి, కూరగాయలు, ఆయిల్పామ్, మిర్చి పంటలు సాగు చేస్తున్నారు. మెట్టభూముల్లో మాత్రం అగ్రభాగం పత్తిదే.

పత్తి సాగుకే సై

పత్తి సాగుకే సై