
స్పోర్ట్స్ కాంప్లెక్స్ దిశగా..
వివిధ క్రీడలకు అనువుగా..
యాభై ఎకరాల స్థలం కేటాయింపు జరిగితే కనీసం పదిహేను ఎకరాల విస్తీర్ణంలో ప్రధానంగా స్టేడియం నిర్మించే ఆలోచనలో ఉన్నారు. ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్, ఫుట్బాల్, ఆర్చరీ, జిమ్నాస్టిక్స్ ట్రాక్స్, యోగా సెంటర్, జిమ్, ట్రైనింగ్ సెంటర్ తదితర మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలని సంకల్పించారు. కాంప్లెక్స్ నిర్మాణానికి కనీసం రూ.25 కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరనున్నారు. నిధుల కొరత ఎదురైతే డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్, సీఎస్సార్ ఫండ్స్, వామపక్ష ప్రభావిత ప్రాంత అభివృద్ధి ప్రత్యేక నిధులను కూడా ఉపయోగించే అవకాశం పరిశీలించనున్నారు.
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో ఉన్నత ప్రమాణాలతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. జాతీయస్థాయి క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేలా, స్థానికుల్లో క్రీడా నైపుణ్యాలు పెంచేందుకు అవసరమైన మౌలిక వసతులతో నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. నియోజకవర్గానికి ఒకటి వంతున స్టేడియం, మినీ ఇండోర్ స్టేడియాలను నిర్మించేందుకు గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇల్లెందులో సగానికి పైగా పనులు జరిగి ఆగిపోగా, పాల్వంచలో ఇండోర్ స్టేడియం సిద్ధమైంది. మిగిలిన చోట్ల ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఇవి కాకుండా సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు ప్రాంతాల్లో క్రీడా మైదానాలు ఉన్నాయి. భద్రాచలంలో జూనియర్ కాలేజీ గ్రౌండ్ ఒక్కటే అన్ని కార్యక్రమాలకు దిక్కుగా మారింది. జిల్లా కేంద్రంలో ప్రగతి మైదాన్, సాధన గ్రౌండ్స్ (రామవరం), శ్రీరామచంద్ర డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా ఇండోర్, అవుట్డోర్ క్రీడలు ఒకే చోట ఆడుకునేలా, స్పోర్ట్స్, గేమ్స్కు అనువుగా మైదానాలు లేవు. ఈ లోటును తీర్చేందుకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి.
50 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిపాదనలు
బొగ్గు తవ్వకాల కోసం నైజాం జమానాలోనే సింగరేణి వందలాది ఎకరాలను లీజుకు తీసుకుంది. ఇందులో చాలా భూములను బొగ్గు తవ్వకాలు, క్వార్టర్లు, కార్యాలయాల నిర్మాణాలు వంటి అవసరాలకు ఉపయోగించుకుంది. అయినప్పటికీ పెద్ద ఎత్తున భూములు సింగరేణి ఆధీనంలో నిరుపయోగంగా ఉన్నాయి. స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం కొత్తగూడెం ఏరియా పరిధిలో నిరుపయోగమైన భూముల్లో 50 ఎకరాలు కేటాయించాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఇప్పటికే సింగరేణి యాజమాన్యాన్ని కోరారు. ప్రస్తుతం ఈ ఫైలు తుది పరిశీలన దశలో ఉంది. జిల్లా కేంద్రం చుట్టుపక్కల స్థలాన్ని ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
గతంలో ఘనంగా..
కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ఒకప్పుడు రంజీ మ్యాచ్లు నిర్వహించారు. భద్రాచలంలో జరిగే భద్రాద్రి క్రికెట్ టోర్నమెంట్కు ఒకప్పుడు రాష్ట్రస్థాయిలో గుర్తింపు ఉండేది. వెయిట్ లిఫ్టింగ్లో ఇల్లెందు క్రీడాకారులు ఇప్పటికీ జాతీయస్థాయిలో సత్తా చాటుతున్నారు. అయితే 2000 సంవత్సరం తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. క్రీడా రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో జిల్లా వెనకబడిపోయింది. మరోవైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇచ్చిన ఊపులో వేర్వేరు క్రీడాంశాల్లో అనేక లీగ్లు తెర మీదకు వచ్చాయి. నిరంతరం పోటీలు జరుగుతున్నాయి. ద్వితీయశ్రేణి పట్టణాల్లోనూ డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నాయి. అయితే ఈ విషయంలో ‘భద్రాద్రి కొత్తగూడెం’ వెనకబడిపోయింది.
ఒక్కొక్కటిగా..
ఇటీవల కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్గా అప్గ్రేడయింది. యూనివర్సిటీ మంజూరైంది. మెడికల్ కాలేజీ విజయవంతంగా నడుస్తోంది. ఆర్గానిక్ ఫార్మింగ్లో నేషనల్ లెవల్ ఎక్స్లెన్స్ సెంటర్ రానుంది. ఎయిర్పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం సుముఖంగా ఉంది. దీంతో జిల్లా కేంద్రంలో క్రీడల సౌకర్యాల విషయంలో నెలకొన్న లోటు తీరుస్తూ మారిన పరిస్థితులకు తగ్గట్టుగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నారు.
ప్రయత్నాలు మొదలు పెట్టాం
నోటిఫైడ్ ఏరియాగా ఉన్న కొత్తగూడెం పట్టణానికి మున్సిపాలిటీ హోదా, రైల్వే అండర్ బ్రిడ్జి, ముర్రేడుపై హైలెవల్ వంతెన, కిన్నెరసాని తాగునీరు వంటి అంశాలపై తొలిసారిగా డిమాండ్ తెరపైకి తెచ్చింది, నిరంతర ఉద్యమాలను తొలిసారిగా చేసింది నేనే. కమ్యూనిస్టు ఉద్యమ నేతగా ప్రజల అవసరాల కోసం చేసిన ప్రతిపాదనలు తర్వాత కాలంలో సాకారమయ్యాయి. అదే విధంగా కొత్తగూడెంలో క్రీడా అవసరాల కోసం స్టేడియం కట్టడానికి ప్రయత్నాలు మొదలెట్టాం.
– కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్యే,
కొత్తగూడెం
కొత్తగూడెంలో ఏర్పాటుకు అడుగులు
50 ఎకరాల్లో రూ.25 కోట్లతో ప్రణాళిక
నిర్మాణం జరిగితే క్రీడాభివృద్ధిలో కీలక మైలురాయి