
ప్రజలతో మమేకం.. పథకాలు చేరువగా..
● ఆర్థికాభివృద్ధి సాధించేలా రైతులకు ప్రోత్సాహం ● పర్యాటకాభివృద్ధితో స్థానికులు ఆదాయం పొందేలా కృషి ● జితేష్ వి.పాటిల్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టి నేటితో ఏడాది
సూపర్బజార్(కొత్తగూడెం): జితేష్ వి.పాటిల్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టి నేటితో ఏడాది పూర్తికానుంది. 2014, జూలై 16న బాధ్యతలు స్వీకరించిన ఆయన ప్రజలతో మమేకమవుతూ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యేలా కృషి చేస్తున్నారు. పేద ప్రజలకు విద్య, వైద్యం అందేలా శ్రద్ధ చూపుతూనే ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నారు. వ్యవసాయంపై మక్కువ చూపుతూ ఆర్థికాభివృద్ధి సాధించాలంటే ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని రైతులకు స్వయంగా అవగాహన కల్పిస్తున్నారు. మునగసాగు, పెరటికోళ్ల పెంపకం, తేనెటీగల పెంపకం, పుట్టగొడుగుల సాగు వంటి వాటిపై రైతులను చైతన్యం చేస్తూ సేంద్రియ వ్యవసాయం చేయాలని సూచిస్తున్నారు. చేపల పెంపకం చెరువుల ద్వారానే కాకుండా సాగుభూములలో ఫామ్పాండ్లలో కూడా చేపల పెంపకం, అంతరపంటల ద్వారా ఆదాయ వనరులు ఏర్పరుచుకోవాలని చెబుతున్నారు. భద్రాచలంలో గిరిజన సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా ట్రైబల్ హట్స్ ఏర్పాటు చేయించారు. చండ్రుగొండలో కనకగిరి గుట్టల్లో పర్యాటకానికి, అశ్వాపురం మండలం తుమ్మల చెరువులో బోటింగ్కు నాంది పలికారు. ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణపైనా దృష్టి పెట్టారు. మారుమూల గిరిజన గ్రామాల్లో విద్య, వైద్యంపై శ్రద్ధ పెట్టడంతోపాటు పర్యావరణ పరిరక్షణ, ఔషధ మొక్కల పెంపకానికి కృషి చేస్తున్నారు. ఇంకుడు గుంతల నిర్మాణం ఉద్యమంలా చేపట్టి జిల్లా దేశంలోనే మొదటిస్థానంలో నిలిచేలా పాటుపడుతున్నారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన ముద్ర వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.