
సరిహద్దుల్లో ఇసుక దందా!
దమ్మపేట : ‘కొంటె మా ఇసుకే కొనాలి. లేకుంటే మీరు తెచ్చుకున్న ఇసుక వాహనాలను, ఇసుకను సీజ్ చేయిస్తాం.’ అంటూ దళారులు సామాన్యులను బెదిరిస్తున్నారు. కొందరు వ్యక్తులు ఆంధ్రా నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో యథేచ్ఛగా ఇసుక దందా సాగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. దమ్మపేట తదితర ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లతో పాటు సామాన్యుల ఇంటి నిర్మాణాలకు కొందరు ఆంధ్రాలోని రాజమండ్రి నుంచి గోదావరి ఇసుక తెప్పించుకుంటున్నారు. గతంలో తెలంగాణలో ఇసుక రీచ్లకు ప్రభుత్వం నుంచి అనుమతులు లేకపోవడంతో ఇంటి నిర్మాణదారులు అటువైపు ఇసుక తెప్పించుకున్నారు. అనుమతులు లేని కారణంగా అడపాదడపాగా పోలీసులు తనిఖీలు చేపట్టి కేసులు కూడా నమోదు చేశారు. ప్రస్తుతం జిల్లాలో మణుగూరులో రీచ్లకు ప్రభుత్వం నుంచి అనుమతులు లభించడంతో ఇసుక తోలకాలను ప్రారంభించారు. కానీ ఆంధ్రా ప్రాంతానికి చెందిన గోదావరి ఇసుక తెలంగాణలో కంటే తక్కువ ధరకు రావడంతో ఎక్కువమంది అటువైపు నుంచే ఇసుక తెప్పించుకుంటున్నారు. ఇదే అదునుగా దళారులు రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి వేళల్లో లారీలను అడ్డుకుని, సీజ్ చేయిస్తామని భయభ్రాంతులకు గురిచేస్తూ, లారీకి రూ. రూ. 10 వేల నుంచి రూ. 20 వేల వరకు అనధికారికంగా వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు చెందిన ఉద్యోగి ఒకరు ఇసుక వాహనాలను అడ్డుకుంటూ, సహకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇసుక తమ ద్వారానే కొనాలని, లేకపోతే పోలీసులు, ఫారెస్ట్ అధికారుల ద్వారా సీజ్ చేయిస్తామని బెదిరించి అధిక మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో వినియోగదారులు వారినే ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మా వద్దే కొనాలని
దళారుల బెదిరింపులు
లేకపోతే లారీలు సీజ్ చేయిస్తామంటూ అక్రమంగా వసూళ్లు
ఆంధ్రా సరిహద్దు ప్రాంతంలో మూడు నెలలుగా దందా
పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారుల తీరుపై విమర్శలు
అధికారుల నిఘా ఏదీ..?
అర్థరాత్రి వేళ మండలానికి శివారులో ఉన్న ఆంధ్రా సరిహద్దు ప్రాంతాల్లో ఒకరిద్దరు దళారులు పోలీసుల మాదిరిగా గస్తీ తిరుగుతూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రాలోని దళారులతో కలిసి ఇసుక రవాణా చేస్తూ ఒక్కో లారీ ఇసుకపై రూ.10,000 వరకు సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. సరిహద్దుల్లో మూడు నెలలుగా అర్ధరాత్రి వేళల్లో ఇసుక దందా సాగుతున్నా అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవడంలేదు. వీరికి సహకరిస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకోకపోవడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారులు ఇప్పటికై నా మేల్కొని సరిహద్దుల్లో సాగుతున్న దందాను అరికట్టాలని పలువురు కోరుతున్నారు.
నా దృష్టికి రాలేదు
ఇసుక లారీలను అడ్డుకుంటూ వసూళ్లకు పాల్పడుతున్న విషయం ఇప్పటివరకు నా దృష్టికి రాలేదు. బాధితులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. ఇక నుంచి రాత్రి వేళల్లో నిఘా పటిష్టం చేస్తాం. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం.
–సాయికిషోర్ రెడ్డి, దమ్మపేట ఎస్సై
చర్యలు తీసుకోవాలి
ఇంటి నిర్మాణాల కోసం తెచ్చుకుంటున్న ఇసుక లారీలను అడ్డుకుని, సామాన్యులను ఇబ్బంది పెట్టడం సరికాదు. ఇసుకను తక్కువ ధరలో అందరికీ అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దందాకు పాల్పడుతున్న వారిపై కూడా చర్యలు చేపట్టాలి.
–చెక్కిరాల మల్లేశ్వరరావు, దమ్మపేట

సరిహద్దుల్లో ఇసుక దందా!

సరిహద్దుల్లో ఇసుక దందా!