
నేడు ప్రజావాణి రద్దు
సూపర్బజార్(కొత్తగూడెం): రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులతో రాష్ట్రవ్యాప్తంగా ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతు వేదికలలో రైతులు పాల్గొననున్నారని పేర్కొన్నారు. జిల్లా అధికారులంతా ఈ కార్యక్రమ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నందున సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి దరఖాస్తులు అందజేయడానికి కలెక్టరేట్కు రావొద్దని కలెక్టర్ సూచించారు.
నేడు గిరిజన దర్బార్
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో ఆదేశించారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే గిరిజన దర్బార్లో ఆదివాసీ గిరిజనలు తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందజేయాలని పేర్కొన్నారు.
కేంద్ర పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
ఐటీడీఏ పీఓ రాహుల్
భద్రాచలంటౌన్: ఆదివాసీ గిరిజనులు కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు ధర్తీ ఆబా జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష అభియాన్ శ్యాచురేషన్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఐటీడీఏ పరిధిలోని 19 మండలాల్లో ఈ క్యాంపులు నిర్వహిస్తామని తెలిపారు. వీటిల్లో ఆధార్, కుల ధ్రువీకరణ, ఓటర్ గుర్తింపు, రేషన్, కిసాన్ క్రెడిట్ కార్డులు, కిసాన్ సమ్మన్ నిధి యోజన, ఆయుష్మాన్ భారత్, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు, జన్ధన్, ఎన్ఆర్ఈజీఎస్ కార్డులను అర్హులకు అందిస్తారని వివరించారు. ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు అవగాహన సదస్సులు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు. ముమ్మరంగా ప్రచారం చేసేందుకు కోయ, లంబాడా భాషల్లో కూడా వాల్ పోస్టర్లు ముద్రించినట్లు తెలిపారు.
కిన్నెరసానిలో
పర్యాటక సందడి
పాల్వంచరూరల్: కిన్నెరసానిలో పర్యాటకులు ప్రకృతి అందాలను తిలకించి సందడి చేశారు. మండల పరిధిలోని కిన్నెరసానికి ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్, జలాశయం, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రకృతి అందాల నడుమ ఉత్సాహంగా గడిపారు. 599 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖకు రూ.33,145 ఆదాయం లభించింది. 400 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.22,000 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
లౌక్యకు నాట్యమయూరి అవార్డు
మణుగూరు టౌన్: మండలానికి చెందిన చింతలపూడి లౌక్యను నాట్యమయూరి అవార్డు వరించింది. ఆదివారం హైదరాబాద్లోని తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో జానపద కూచిపూడి నృత్య సంబరాల ప్రతిభ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సినీ సంగీత విభావరి కార్యక్రమంలో లౌక్య ప్రతిభ చూపగా, నాట్య మయూరి అవార్డును అందజేశారు. కాగా చిన్నారి ఐదో తరగతి చదువుతుండగా, వరంగల్, హనుమకొండ, జమ్మికుంట ప్రాంతాల్లో ప్రదర్శనలు ఇచ్చి ప్రతిభ చాటింది. ఈ సందర్భంగా చిన్నారిని పలువురు అభినందించారు.

నేడు ప్రజావాణి రద్దు