రైతు భరోసా రెడీ.. | - | Sakshi
Sakshi News home page

రైతు భరోసా రెడీ..

Jun 16 2025 6:01 AM | Updated on Jun 16 2025 6:01 AM

రైతు

రైతు భరోసా రెడీ..

నేటి నుంచి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్న ప్రభుత్వం

జిల్లాలో 1.87 లక్షల మంది రైతులకు లబ్ధి

అందనున్న రూ.331.97 కోట్ల పెట్టుబడి సాయం

బూర్గంపాడు: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయమందించేందుకు రంగం సిద్ధం చేసింది. సోమవారం నుంచి బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా నగదు జమచేయనుంది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ప్రకటించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి సోమవారం సాయంత్రం 4 గంటలకు రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్‌లో రైతులతో మాట్లాడనున్నారు. వ్యవసాయ సీజన్‌ ఆరంభంలో భరోసా అందనుండటంతో రైతులకు ఉపయోగకరంగా మారనుంది.

గతేడాది అందనిసాయం

గత వానాకాలం సీజన్‌లో రైతు భరోసా అందక పంటల సాగు పెట్టుబడులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. రుణమాఫీపై ఫోకస్‌ చేసిన ప్రభుత్వం రైతు భరోసాను పక్కకు పెట్టింది. యాసంగిలో కూడా పూర్తిస్థాయిలో అందించలేదు. గత జనవరి 26 నుంచి దశలవారీగా నాలుగెకరాల లోపు పట్టా భూములున్న రైతులకు మాత్రమే అందించింది. అంతకు మించి భూములున్న రైతులకు పెట్టుబడి సాయం అందలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుత వానాకాలం సీజన్‌లో కూడా రైతు భరోసా వస్తుందో రాదోననే ఆందోళనలో ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన ఊరటనిచ్చింది.

5.53 లక్షల ఎకరాలకు..

జిల్లాలో వానాకాలం వ్యవసాయ సీజన్‌లో పట్టా భూములు, అటవీ హక్కులు కలిగిన భూములకు మొత్తంగా 5.53 లక్షల ఎకరాలకు సంబంధించి 1,87,839మంది రైతులకు పెట్టుబడి సాయం అందనుంది. రూ. 331.97 కోట్లను రైతు భరోసా కింద అందించనున్నారు. సోమవారం నుంచి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి వారం రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా వ్యవసాయ అధికారులు ఇప్పటికే రైతు భరోసా అర్హుల జాబితాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. బ్యాంకు ఖాతాల్లో మార్పులు, చేర్పులు ఉంటే సరిచేసి నివేదిస్తున్నారు.

రైతు భరోసా రెడీ..1
1/1

రైతు భరోసా రెడీ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement