
వంతెన అంతేనా..?
రెండేళ్లుగా సాగుతున్న
కరకట్ట పనులు
గోదావరి వరదల నుంచి కాపాడేందుకు 2000 సంవత్సరంలో కరకట్ట నిర్మించగా, కూనవరం రోడ్డుకు ఇరువైపులా 700 మీటర్ల మేర పనులు ఆగిపోయాయి. ఆ పనులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా రూ. 38 కోట్లను ప్రకటించింది. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం భద్రాచలం అభివృద్ధి దృష్ట్యా నిధులు విడుదల చేసి పనులు చేపట్టింది. పనులు 2024 జూన్ నాటికే పూర్తి కావాల్సి ఉన్నా ఇంకా సాగుతూనే ఉన్నాయి. ఇక విజయవాడ– జగదల్పూర్ జాతీయ రహదారిపై నిర్మించాల్సిన ఓవర్ బ్రిడ్జి పీటముడిగా మారింది. మట్టి శాంపిల్స్ టెస్టులు, పలుమార్లు డిజైన్లను పరిశీలించాక ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు.
భద్రాచలం: గోదావరి వరదల నుంచి పట్టణంలోని సుభాష్నగర్ పరిసర ప్రాంత కాలనీలను ముంపు నుంచి కాపాడేందుకు కూనవరం రోడ్డులో చేపట్టిన కరకట్ట పనులు పూర్తవుతున్నా కానీ బ్రిడ్జి పనులు మాత్రం ప్రారంభం కాలేదు. అప్రోచ్ రోడ్, బ్రిడ్జి డిజైన్ను జాతీయ రహదారుల శాఖ ఆమోదించకపోవడంతో జాప్యం జరుగుతోంది. దీంతో ఈ ఏడాది వర్షాకాల సీజన్కు కరకట్టకు బ్రిడ్జి పూర్తయ్యే పరిస్థితిలేదు. అయితే వరదలు సంభవించినా ముంపు కాలనీలకు ప్రమాదం లేకుండా ఇరిగేషన్ అధికారులు పనులు చేపడుతున్నారు. గోదావరి వరదలు సాధారణస్థాయిలో ఉంటే ముంపు కాలనీలకు రక్షణ ఉంటుందని చెబుతున్నారు.
ఓవర్ బ్రిడ్జి, అప్రోచ్ రోడ్డు, ఇతర పనులకు
రూ.100 కోట్లు?
ఇటీవల హైదరాబాద్కు చెందిన రూకే అనే ప్రైవేట్ సంస్థ రూపొందించిన ఓవర్ బ్రిడ్జి డిజైన్ను అధికారులు ఆమోదించారు. ఫైనల్ చేసేందుకు సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ శాఖకు పంపగా, అక్కడ ఆమోదించాల్సి ఉంది. కరకట్ట పొడిగింపునకు ప్రభుత్వం కేవలం రూ. 38 కోట్లను మాత్రమే విడుదల చేయగా, ఇప్పుడు ఆమోదించిన డిజైన్, ఇతర పనులకు సుమారు రూ. 100 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. నిధుల విడుదలయ్యాకే పనులు ప్రారంభవుతాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత వర్షాకాల సీజన్లో ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభమయ్యేలా లేదు. కాగా ఇక్కడి బ్రిడ్జి కొత్తగూడెం, సుజాతనగర్ మధ్యలో నిర్మించిన ఆర్వోబీ తరహాలో ఉండనుంది.
సాధారణ వరదలకు సేఫ్
ఓవర్ బ్రిడ్జి పనులు ఆగిపోయినా ఇతర కరకట్ట పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. కరకట్టకు రాళ్లతో రాక్టో పనులను పూర్తి చేస్తున్నారు. స్లూయిజ్ నిర్మాణాలను పూర్తి చేసి గేట్లను బిగించారు. మరోవైపు కరకట్టకు అవతలి వైపున మూడు మీటర్ల వెడల్పుతో బర్మ్ నిర్మాణం చేపట్టాలని భావించారు. ఇందుకోసం 21 మంది రైతుల నుంచి భూ సేకరణ చేపట్టనున్నారు. ఇది సైతం కలెక్టర్ వద్ద ఆమోదం పొందే దశలో ఉంది. అవసరమైన గ్రావెల్ ఏపీలోని చోడవరం నుంచి తరలించాల్సి ఉండగా, అనుమతి కోసం ఐటీడీఏ పీఓకు దరఖాస్తు చేశారు. అనుమతులు రాగాన్ బర్మ్ పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే చేపట్టిన పనులతో గోదావరి వరదలు 34 అడుగుల మేర వచ్చినా చుక్క నీరు ముంపు కాలనీల్లోకి ప్రవేశించే అవకాశం లేదని అధికారులు పేర్కొంటున్నారు. 54 అడుగులకు మాత్రమే జాతీయ రహదారిపై వరద నీరు వస్తుందని, ఆ సమయంలో అత్యవసర రోడ్డును తాత్కాలిక పద్ధతిన మూసివేస్తామని ఇరిగేషన్ అధికారులు తెలుపుతున్నారు.
డిజైన్ ఆమోదం పొందగానే.
ఓవర్ బ్రిడ్జి, అప్రోచ్ రోడ్ డిజైన్ను సీడీఓకు పంపించాం. అనుమతి, బడ్జెట్ ఆమోదం కాగానే పనులను ప్రారంభిస్తాం. గోదావరి వరదలు సాధారణ స్థాయిలో వచ్చినా ముంపు కాలనీలకు రక్షణ కల్పించేందుకు చర్యలు చేపట్టాం.
–సయ్యద్ అహ్మద్ జానీ,
భద్రాచలం ఇరిగేషన్ ఈఈ,
ఇంకా డిజైన్ ఆమోదం పొందని గోదావరి కరకట్ట బ్రిడ్జి
భద్రాచలంలో వేగంగా సాగుతున్న రాక్టో, బర్మ్ పనులు
వరదలు సాధారణ స్థాయిలో ఉంటే ముంపు కాలనీలకు రక్షణ

వంతెన అంతేనా..?

వంతెన అంతేనా..?